విమాన ప్రమాదంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత.. ఎన్ని వేల కోట్లు వస్తాయి..?

విమాన ప్రమాదంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత.. ఎన్ని వేల కోట్లు వస్తాయి..?

గడచిన మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ కనీవిని ఎరుగని విమాన ప్రమాదం నిన్న అహ్మదాబాదులో చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ ప్రయాణిస్తు్న్న ఫ్లైట్ నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలి అగ్నిగోళంగా మారిపోయింది. అయితే ఈ భారీ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదం కారణంగా మెుత్తం పరిహారం ఎంత ఉంటుందనే అంశం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. 

వాస్తవానికి గుజరాత్ రాజధాని అహ్మదాబాదులో నిన్న జరిగిన ప్రమాదం కారణంగా భారత విమానయాన చరిత్రలో అతిపెద్ద పరిహారం చెల్లింపు జరగనుందని వెల్లడైంది. దీని వల్ల గరిష్ఠంగా 280 మిలియన్ డాలర్ల వరకు చెల్లించాల్సి రావొచ్చని తేలింది. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ దాదాపు రూ.2వేల 400 కోట్లుగా అంచనా వేయబడింది. 

►ALSO READ | ఎయిర్ ఇండియా విమానం క్రాష్.. బ్రతికిన ఒకే ఒక్కడికి పరిహారంగా ఏం చెల్లిస్తారు..?

వాస్తవానికి ఎయిర్ లైన్ సంస్థలు తమ విమానాలకు తీసుకునే ఇన్సూరెన్స్ సాధారణంగా స్పేర్ పార్ట్స్, విమానం హల్, ప్యాసింజర్లకు జరిగే నష్టాలు, థర్డ్ పార్టీలకు జరిగే నష్టాలను కవర్ చేస్తాని ఇన్సూరెన్స్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోవటంతో బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ హల్ అంటే బాడీకి జరిగిన నష్టాలతో పాటు.. పూర్తిగా విమానాన్ని కోల్పోయినందుకు, దాని బాధ్యతలకు కూడా చెల్లింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన విమానం 11 ఏళ్ల పాతది. 2013 మోడల్ అయిన ఈ విమానానికి 115 మిలియన్ డాలర్ల విలువతో చివరిగా 2021లో ఇన్సూరెన్స్ చేయబడింది. అయితే ప్రస్తుతం విమాన విలువ ఆధారంగా చెల్లింపులను ఇన్సూరెన్స్ సంస్థలు చేపడతాయి. 

ప్రస్తుతం ఎయిర్ ఇండియా యజమానిగా ఉన్న టాటా గ్రూప్ విమాన ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.కోటి పరిహారంగా చెల్లించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రమాదం దాదాపు వందల కోట్ల నష్టాలకు దారితీయవచ్చని నిపుణులు చెప్పారు. వాస్తవానికి విమానయాన రంగంలో జరిగే పెద్ద ప్రమాదాలకు రీఇన్సూరెన్స్ ఉండటం వల్ల సంస్థలు తట్టుకోగలవు. అయితే ఈ పరిణామాలు విమానయాన రంగంలో ఇన్సూరెన్స్ ప్రీమియంలను పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.