ఎయిర్ ఇండియా విమానం క్రాష్.. బ్రతికిన ఒకే ఒక్కడికి పరిహారంగా ఏం చెల్లిస్తారు..?

ఎయిర్ ఇండియా విమానం క్రాష్.. బ్రతికిన ఒకే ఒక్కడికి పరిహారంగా ఏం చెల్లిస్తారు..?

నిన్న జరిగిన ప్రమాదంలో విమానంలో దాదాపు 242 మంది ప్రయాణిస్తున్నారు. అయితే విచిత్రంగా ఒక్క ప్యాసింజెర్ మినహా 241 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదంలో జరిగిన నష్టం మెుత్తం విలువ ఏకంగా రూ.2వేల 400 కోట్లకు పైగానే ఉంటుందని, భారత విమానయాన చరిత్రలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తోంది. రమేష్ విశ్వకుమార్ బుచర్వాడా అనే ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తాను ఎలా బ్రతికి బయటపడ్డాననే విషయం తనకే తెలియదని సదరు వ్యక్తి చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా చనిపోయిన వారికి ఎయిర్ ఇండియా కోటి రూపాయలు, ఇతర ఇన్సూరెన్స్ కరవేజీలు లభిస్తున్నాయి.

అయితే ఇప్పుడు అతిపెద్ద అంశం ఏమిటంటే.. మృత్యుంజయుడిగా అగ్నికీలల నుంచి బయటపడి ప్రాణాలతో చికిత్స పొందుతున్న సీటు నంబర్ 11A ప్రయాణికుడు రమేష్ విశ్వకుమార్ కుమార్ పరిహారంగా ఏం పొందుతారు అన్నదే. వాస్తవానికి మాంట్రియల్ కన్వెన్షన్ ఒప్పందం కింద ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి దాదాపు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సంస్థ ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్ సహా టాటా ఏఐజీ పాలసీలు ప్రమాదాలను కవర్ చేస్తున్నాయి. ఈ సంస్థలు సంయుక్తంగా ప్రస్తుత ప్రమాదానికి చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ప్రస్తుత ప్రమాదంలో దెబ్బతిన్న విమానాలు, చనిపోయిన లేదా గాయపడిన ప్రయాణీకులు, థర్డ్ పార్టీ బాధ్యతల నుండి సేకరించబడిన క్లెయిమ్‌లలో 95 శాతం రీఇన్సూరెన్స్ సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వీటి చెల్లింపు, ప్రాసెసింగ్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

మరణించిన లేక గాయపడిన ప్రయాణికులకు లభించే పరిహారం..
* ప్రస్తుత ప్రమాదంలో బ్రతికిన రమేష్ విమానయాన సంస్థ నుంచి ప్రమాదానికి గాను రూ.75 లక్షల కంటే ఎక్కువ మెుత్తం పరిహారంగా అందుకోవచ్చని మాంట్రియల్ కన్వెన్షన్ షేడ్యూల్ 3 కింద చెప్పబడింది.
* అలాగే అంతర్జాతీయ విమానంలో ప్రమాదం కారణంగా ప్రయాణికులు తమ లగేజీని కోల్పోతే అందుకు చట్టప్రకారం రూ.లక్ష 20వేల వరకు పరిహారం లభించనుంది. 
* ఇవి కాకుండా రమేష్ వ్యక్తిగతంగా ఏదైనా ట్రావెల్ ఇన్సూరెన్స్, క్రెడిట్-డెబిట్ కార్డ్ స్కీమ్ కింద ఎయిర్ యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఉంటే వాటిని పొందవచ్చు.
* ఇక చివరిగా ప్రభుత్వం, విమానయాన సంస్థ, డీజీసీఏ ప్రమాదంలో బతికిన వ్యక్తి గాయపడినందుకు గాను వైద్య చికిత్స ఖర్చులతో పాటు పరిహారం కూడా అందించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 
* అయితే వీటికి అదనంగా ఏవైనా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, లేదా విమానయాన సంస్థ నుంచి పరిహారం కూడా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులు కుదుటపడిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ రావొచ్చని ఇన్సూరెన్స్ నిపుణులు చెబుతున్నారు.