
- కొనసాగుతున్న డీఎన్ఏ టెస్టులు
- మృతదేహాల కోసం బాధిత కుటుంబాల ఎదురుచూపులు
అహ్మదాబాద్: ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచింది. ఇప్పటికీ మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ప్రమాదంలో శరీరాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలిపోవడంతో డెడ్ బాడీల గుర్తింపునకు అధికారులు డీఎన్ఏ శాంపిల్ టెస్టులు చేస్తున్నారు. సోమవారం నాటికి 99 డెడ్ బాడీలను గుర్తించామని అధికారులు తెలిపారు.
అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 64 మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించినట్లు సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్జోషితెలిపారు. డీఎన్ఏ పరీక్షలకు చాలా సమయం పడుతుందని, బాధిత కుటుంబాలు కాస్త ఓర్పు వహించాలని ఆయన సూచించారు. సాధ్యమైనంత తొందరగా డెడ్ బాడీలను బాధిత కుటుంబాలకు అందజేసేందుకు తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఈ నెల 12 న మధ్యాహ్నం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 270 కు చేరింది. విమానంలోని 241 మంది దుర్మరణం పాలవగా ఒకే ఒక్కడు బతికిబట్టకట్టిండు. ఇక విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్, చుట్టుపక్కల ప్రాంతంలో మరో 29 మంది చనిపోయారు. ఈ విమాన ప్రమాదం తర్వాత నరోదా ఏరియాకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ మహేశ్ కలవాడియా కనిపించకుండా పోయాడు. ఆయన ఫోన్ లాస్ట్ లొకేషన్ సదరు విమాన ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో ఉందని సమాచారం. దీంతో కలవాడియా కూడా చనిపోయి ఉంటాడని ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేస్తోంది.