తెచ్చిన అప్పులు తీర్చాలి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల జీతాల్లో కోత విధిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి. గురువారం గాంధీభవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. రూ.37,400 కోట్ల కిస్తీలు కట్టాలని చెప్పి ఉద్యోగులు, పెన్షనర్ లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం జీతాన్నీ చెల్లిస్తుంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం జీతాల్లో కోత విధిస్తుందన్నారు. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు పాలన చేసే హక్కు లేదన్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పే కేసీఆర్ .. ఉద్యోగుల జీతాల్లో ఎలా కోత విధిస్తాడన్నారు వంశీ చంద్. రాష్ట్ర ప్రభుత్వం 9 నుంచి 11% వడ్డీలకు అప్పులు తీసుకుంటుందని, ప్రైవేట్ వ్యక్తులే అంత వడ్డీ అంటే భయపడతారు, కానీ ప్రభుత్వం మాత్రం ఇష్టారాజ్యంగా ప్రవేటు బ్యాంకుల్లో అప్పులు చేస్తుందని ఆయన అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశాడన్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలకు కట్టాలి కాబట్టి ఉద్యోగుల జీతాలు కట్ చేస్తామని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. రాష్ట్రాన్ని పాలించలేనని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వంశీచంద్ డిమాండ్ చేశారు.