అవగాహనతోనే ఎయిడ్స్​ అంతం

అవగాహనతోనే ఎయిడ్స్​ అంతం

ఒక మహాశయుడు చెప్పినట్లు ఈ ప్రపంచం తుడిచిపెట్టుకు పోవడానికి గల కారణాల్లో మొదటి స్థానంలో ఎయిడ్స్​ఉండగా, తర్వాతి స్థానాల్లో అణుయుద్ధం, సరైన నాయకత్వం లేకపోవడం కనిపిస్తున్నాయి. మానవుడు జీవితంలో అనేక రకాల వ్యాధులతో ముఖ్యంగా బాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు కలిగించే వ్యాధుల బారిన పడతారు. ఈ వ్యాధులన్నీ కూడా చాలా వరకు నయమవుతాయి. కానీ ఇంతవరకు కూడా మందు కనుగొనని వ్యాధి ఏదైనా ఉంది అంటే అది ఎయిడ్స్. గతంలో ఈ వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. కానీ సైంటిస్టుల పరిశోధనల ఫలితంగా శక్తివంతమైన ఏఆర్​టీ మందులను కనుగొనడం వల్ల ప్రస్తుతం ఈ వ్యాధిని కూడా దీర్ఘకాలికంగా నియంత్రించుటకు వీలు కలిగే వ్యాధిగా వ్యవహరిస్తున్నారు.  హ్యూమన్​ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్​గా పిలిచే హెచ్ఐవీ వల్ల ఎయిడ్స్​వ్యాధి సోకుతుంది. భారతదేశంలో మొదటిసారిగా హెచ్​ఐవీ సోకిన వ్యక్తిని 1986 మే నెలలో చెన్నైలో గుర్తించారు. హెచ్ఐవీ వైరస్​రిట్రో విరిడే కుటుంబంలో లెంటి వైరస్​తరగతికి చెందిన ఆర్ఎన్ఏ వైరస్. దీని ఉనికిని 1983లో ల్యూక్​మాంటిగ్నాయర్​ప్యారిస్​లోనూ, 1984లో రాబర్ట్​గాలో అమెరికాలోనూ విడివిడిగా కనుగొన్నారు. 120 నానోమీటర్​ల పరిమాణంలో  వెకోసా హైడ్రల్​ఆకారంలో ఉండే ఈ వైరస్  ‘రివర్స్ ట్రాన్స్​ క్రిప్టేజ్’ అనే ఎంజైమ్​ కారణంగా ఆకారాలను మారుస్తూ ఉంటుంది.

తగ్గుతున్న కేసులు!

ప్రస్తుతం ప్రపంచంలో దక్షిణాఫ్రికాలో 7.5 మిలియన్లు, మొజాంబిక్​లో 2.2 మిలియన్లు, ఇండియాలో 2.1 మిలియన్లు, నైజీరియాలో 1.8 మిలియన్లు మొత్తం 38 మిలియన్లకు పైగా ఈ వైరస్​తో సతమతమవుతున్నారు. భారతదేశంలో మిజోరాం రాష్ట్రంలో ఎయిడ్స్​వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా అంటే జాతీయ సగటుకన్న 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశంలో గత పదేండ్లలో సురక్షితం కాని లైంగిక సంపర్కం వల్ల17 లక్షల మందికి పైగా హెచ్ఐవీ సోకినట్టు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఎన్ఏసీఓ) తెలిపింది. ఎన్ఏసీఓ డేటా ప్రకారం.. అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ కారణంగా 2011 నుంచి 2021 మధ్య మొత్తం 17,08,777 మందికి హెచ్ఐవీ సోకింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 2011–నుంచి 2021 మధ్య అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల 3,18,814 హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్(2,84,577), కర్నాటక(2,12,982), తమిళనాడు(1,16,536) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, 2010 నుంచి 2021కి దేశంలో ఎయిడ్స్/హెచ్ఐవీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఎన్ఐసీఓ వెల్లడించడం మంచి పరిణామం. సురక్షితం కాని ఒకరి కన్నా ఎక్కువమందితో ​సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్తమార్పిడి వల్ల, తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల ఎయిడ్స్​వ్యాధి సంక్రమిస్తుంది. కలిసి తినడం, ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, బుగ్గలపై ముద్దు పెట్టుకోవడం, కరచాలనం ద్వారా, మలమూత్రశాలలను ఒకరి తర్వాత మరొకరు వాడుకోవడం ద్వారా రాదు. హెచ్ఐవీ సోకిన వారు దాదాపు 5 నుంచి 10 ఏండ్ల తర్వాత ఎయిడ్స్​దశకు చేరుకుంటారు.

ఈసారి ‘ఈక్వలైజ్’​ థీమ్​తో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి గ్రస్తులకు మందులు అందించడంతోపాటు, వ్యాధి నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎయిడ్స్​ రోగులకు ‘భరోసా’ పేరుతో నెలకు రూ.2016 పెన్షన్​ రూపంలో ఇస్తున్నది. హెచ్ఐవీ బారిన పడిన వారి హక్కులను రక్షించే ‘హెచ్ఐవీ/ఎయిడ్స్​ నివారణ, నియంత్రణ చట్టం 2017’ సెప్టెంబర్​10, 2018 నుంచి అమల్లోకి వచ్చింది. 1097 టోల్​ఫ్రీ ద్వారా ప్రభుత్వం రోగగ్రస్తుల సమస్యలకు పరిష్కారం సూచిస్తున్నది. ‘రెడ్​రిబ్బన్​ట్రైన్’ దేశంలో 27 వేల కిలోమీటర్లకుపైగా తిరుగుతూ విస్తృత ప్రచారం కల్పిస్తున్నది. ఈ వ్యాధి పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు ఆరో తరగతి నుంచే హెచ్ఐవీ/ఎయిడ్స్​ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. గ్రామీణ ప్రజలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఆశా వర్కర్లను పంపి వ్యాధిని గురించి వివరించేలా చేయాలి. ఏఆర్టీ మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఉచితంగా సరఫరా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. డబ్ల్యూహెచ్వో ఏటా ఒక ప్రత్యేక థీమ్​తో అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ ఏడాది 2022కు గాను ‘ఈక్వలైజ్’తో ముందుకు పోతున్నది. – ఏవీ సుధాకర్, బయాలజీ టీచర్