ఢిల్లీలోని ప్రఖ్యాత ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పై సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఉదయం 7 గంటల నుంచే ఎయిమ్స్ లోని స్మార్ట్ ల్యాబ్, రిపోర్ట్ జనరేషన్ విభాగం, బిల్లింగ్, అపాయింట్మెంట్ విభాగాల్లోని కంప్యూటర్లు మొరాయించాయి. సర్వర్లు డౌన్ కావడంతో వాటిని పునరుద్ధరించేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) కి చెందిన సాంకేతిక నిపుణులు శ్రమిస్తున్నట్లు సమాచారం. సైబర్ ఎటాక్ పై దర్యాప్తును కూడా ప్రారంభించారు.
ఎయిమ్స్ లో వినియోగించే కంప్యూటర్లలోని ఫైళ్లను తెరవకుండా అడ్డుకునే లక్ష్యంతో ఈ సైబర్ దాడి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి ఆస్పత్రిలోని అన్ని విభాగాల కార్యకలాపాలను మ్యానువల్ గా రిజిస్టర్లలో వివరాల నమోదు ద్వారా కొనసాగిస్తున్నారు. అకస్మాత్తుగా కంప్యూటర్లు మొరాయించడంతో ఆన్ లైన్ లో వైద్య నిపుణుల అపాయింట్మెంట్ కోసం ఓపీ (ఔట్ పేషెంట్) రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి క్యూలో నిలబడిన వారు చాలా ఇబ్బందిపడ్డారు. 1978 సంవత్సరం నుంచే ఎయిమ్స్ లోని వైద్యసేవా విభాగాల కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.