
- శత్రువును చావుదెబ్బకొట్టినం
- దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ల శిక్షణ పూర్తి
హైదరాబాద్,వెలుగు: ఆపరేషన్ సిందూర్ తో మన ఎయిర్ ఫోర్స్ సత్తా ప్రపంచానికి తెలిసిందని ఎయిర్ స్టాఫ్ చీఫ్ (సీఏఎస్) ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. గురితప్పకుండా శత్రువును చావుదెబ్బ కొట్టామని తెలిపారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఘనంగా జరిగింది. అకాడమీలో 254 మంది ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీకి చెందిన ఫ్లైట్ క్యాడెట్లు ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ పరేడ్ కార్యక్రమానికి ఏపీ సింగ్ రివ్యూయింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లకు రాష్ట్రపతి కమిషన్ను ఆయన ప్రదానం చేశారు.
అనంతరం పరేడ్ను ఉద్దేశించి సింగ్ మాట్లాడారు. భవిష్యత్తు యుద్ధ సవాళ్లు వేగంగా మారుతున్నాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సవాళ్లను అధిగమించేందుకు క్రమశిక్షణతో పాటు నిరంతర అభ్యాసాన్ని, అధ్యయనాన్ని అలవర్చుకోవాలని క్యాడెట్లకు ఆయన సూచించారు. దేశానికి ముప్పు సంభవించినప్పుడు మొదటి రెస్పాండర్గా వాయుసేన ముందుంటుందని పేర్కొన్నారు.
యువ అధికారులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చిన ఎయిర్ఫోర్స్ అకాడమీ అధికారులు, సిబ్బందిని సింగ్ ఈ సందర్భంగా అభినందించారు. అకాడమీలో ఇండియన్ నేవీకి చెందిన తొమ్మిది మంది, కోస్ట్గార్డ్ నుంచి ఏడుగురు, వియత్నాం నుంచి ఒకరు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఫ్లయింగ్ ట్రైనింగ్ పూర్తిచేసుకున్నందుకు వారికి ‘వింగ్స్’ హోదా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.