ఇండోనేషియాలో బద్దలైన భారీ అగ్ని పర్వతం.. బాలి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే రివర్స్

ఇండోనేషియాలో బద్దలైన భారీ అగ్ని పర్వతం..  బాలి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే రివర్స్

న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని న్గురా రాయ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలో భారీ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో ఢిల్లీ నుంచి బాలికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే తిరిగి వెనక్కి వచ్చింది. అధికారుల ప్రకారం.. 2025, జూన్ 17న మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది 11 కి.మీ ఎత్తు వరకు లావా, బూడిద ఎగిసిపడింది. అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిద ఆకాశాన్ని కమ్మేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి బాలి బయలదేరిన ఎయిర్ ఇండియా AI2145 విమానాన్ని మార్గమధ్యలోనే వెనక్కి మళ్లించారు. తిరిగి విమానాన్ని ఢిల్లీలో ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఎయిర్ ఇండియాతో సహా పలు విమానాలను రద్దు చేశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇండోనేషియాలోని మౌమెరేలోని ఫ్రాన్సిస్కస్ జేవేరియస్ సెడా విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. బాలిలోని న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. 

అగ్నిపర్వత బూడిద విమాన ఇంజిన్లు, దృశ్యమానతకు అంతరాయం కల్పించి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. విమానం తిరిగి ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణీకులందరినీ ఢిల్లీలో సురక్షితంగా దింపామని తెలిపింది. ప్రయాణీకులకు హోటల్ వసతి కల్పించామని,  అలాగే టికెట్ డబ్బులు పూర్తి రిఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్‌ అవకాశం కల్పించామని పేర్కొంది.