
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానాల్లో వరుసగా తలెత్తున్న సాంతకేతి సమస్యలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విమానంలో సాంకేతి సమస్యలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ఫ్లైట్ జర్నీ అంటేనే ప్రయాణికులు జంకే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం బయటపడింది.
సోమవారం (జూలై 21) ఢిల్లీ నుంచి కోల్కతా వెళ్లాల్సిన ఎయిరిండియా ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. ఢిల్లీ నుంచి టేకాఫ్ కావడానికి నిమిషాల ముందే విమానంలో సాంకేతి లోపం తలెత్తడంతో టేకాఫ్ను ఆపేశారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. వాస్తవానికి ఈ విమానం సోమవారం (జూలై 21) రాత్రి 7.30కు టేకాఫ్ కావాల్సి ఉంది. సాంకేతిక లోపం కారణంగా రాత్రి 9 గంటలకు టేకాఫ్ రీ షెడ్యూల్ చేశారు. కానీ అప్పటికీ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోవడంతో చివరకు ప్లయిట్ సర్వీసును రద్దు చేశారు.
ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించింది. టేకాఫ్ సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా 2025, జూలై 21న ఢిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ప్లయిట్ సర్వీస్ రద్దు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఎయిరిండియా పేర్కొంది. ప్రయాణికులకు కలిగిన అంతరాయం పట్ల చింతిస్తున్నామని.. వారికి తమ సిబ్బంది సహయం చేస్తున్నారని తెలిపింది.