
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత తొలిసారి మీడియా సమావేశం నిర్వహించింది కేంద్రం. శనివారం (జూన్14) శాఖ కార్యదర్శితో కలిసి ప్రమాదానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసిందన్నారు. ప్రమాద సంఘటన వివరాలను మీడియాకు వివరించారు.
జూన్ 12న అహ్మదాబాద్లో కూలిపోయి కనీసం 260 మంది మృతి చెందారు. టేకాఫ్ తీసుకున్న తర్వాత విమానం 650 అడుగుల ఎత్తుకు వెళ్లింది ఆ తర్వాత క్రమంగా డౌన్ కావడం జరిగిందన్నారు. టేకాఫ్ అయిన సరిగ్గా ఒక నిమిషం తర్వాత మేఘనినగర్లోని మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్పై విమానం కూలిపోయిందని అన్నారు.
650 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత విమానం ఎత్తు కోల్పోవడం ప్రారంభమైంది. పైలట్ మధ్యాహ్నం 1:39 (జూన్ 12) గంటలకు ATCకి మేడే కాల్ ఇచ్చాడని తెలిపారు.
ATC ప్రకారం విమానాన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు ఎటువంటి స్పందన రాలేదు. సరిగ్గా ఒక నిమిషం తర్వాత విమానాశ్రయం నుంచి2 కి.మీ దూరంలో ఉన్న మేఘని నగర్లో విమానం కూలిపోయింది" అని పౌరవిమానయాన శాఖ కార్యదర్శి సిన్హా అన్నారు.
గురువారం ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం పారిస్-ఢిల్లీ-అహ్మదాబాద్ సెక్టార్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసిందని సిన్హా చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రమాదం తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్ విమానాలను పరిశీలనకు డీజీసీఏకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. దేశంలో మొత్తం 34 బోయింగ్ విమానాలు ఉండగా, ఇప్పటికే 8 విమానాలను చెక్ చేసినట్లు చెప్పారు.