గత్తర లేపుతున్న చెడుగాలి.. ఎయిర్ పొల్యూషన్కు మన దేశంలో ఏటా 20 లక్షల మంది మృతి

గత్తర లేపుతున్న చెడుగాలి.. ఎయిర్ పొల్యూషన్కు మన దేశంలో ఏటా 20 లక్షల మంది మృతి
  • హెల్త్​ ఎఫెక్ట్స్​ ఇన్​స్టిట్యూట్​ తాజా నివేదికలో వెల్లడి
  • చైనాతోపాటు ఇండియాలోనే భారీగా మరణాలు
  • లక్ష మందిలో 186 మంది గాలి కాలుష్యానికే బలి
  • శ్వాస వ్యవస్థపైనే కాదు గుండె, మెదడుపైనా తీవ్ర ప్రభావం
  • క్యాన్సర్​, మతిమరుపు, 35% గుండె జబ్బులకూ ఇదే కారణం

న్యూఢిల్లీ: గాలి కాలుష్యం గత్తర లేపుతున్నది. రోజురోజుకు పెరిగిపోతున్న దీని ధాటికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్క 2023లోనే మన దేశంలో ఎయిర్​ పొల్యూషన్​ వల్ల దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. శ్వాస వ్యవస్థపైనే కాకుండా నాడీ వ్యవస్థ, గుండె పైనా చెడుగాలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. గుండె జబ్బులకు ఎయిర్​ పొల్యూషన్​ కూడా ఓ ప్రధాన కారకంగా మారుతున్నది.  అంతర్జాతీయ సంస్థ ‘హెల్త్​ ఎఫెక్ట్స్ ఇన్​సిట్ట్యూట్​ (హెచ్​ఈఐ)’ తాజా నివేదికలో ఇది తేలింది. ఇన్​స్టిట్యూట్​ ఫర్​ హెల్త్​ మెట్రిక్స్​ అండ్​ ఎవాల్యుయేషన్​ సంస్థతో కలిసి ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యంపై స్టడీ చేసి ‘స్టేట్​ ఆఫ్​ గ్లోబల్​ ఎయిర్​ – ‌‌‌‌-2025’ పేరిట రిపోర్టును విడుదల చేసింది. భారత్​లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని.. ముఖ్యంగా ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో జనం ఊపిరాడక ఆగమవుతున్నారని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 

52% మరణాలు ఆ రెండు దేశాల్లోనే

గాలి కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2023లో 79 లక్షల మంది చనిపోతే.. అందులో 52 శాతం మరణాలు చైనా, భారత్​లోనే సంభవించాయని హెచ్​ఈఐ తన నివేదికలో పేర్కొంది. 2023లో ఇండియాలో 20 లక్షల మంది, చైనాలో 20 లక్షల మంది గాలి కాలుష్యానికి బలయ్యారు. 

లక్షలో 186 మంది..!

ఎయిర్​ పొల్యూషన్​తో అత్యధిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రీజియన్స్​లో సౌత్​ ఏసియా మొదటి స్థానంలో ఉంది. ఇందులో ఇండియాది ఫస్ట్​ ప్లేస్​.  సౌత్​ ఏసియాలో 2023లో ప్రతి లక్ష మందిలో 195 మంది కేవలం గాలి కాలుష్యం వల్లే చనిపోయారని.. ఇదే ఇండియాలో ప్రతి లక్ష మందిలో 186 మంది దీని ప్రభావంతో చనిపోయరని హెచ్​ఈఐ తన రిపోర్టులో పేర్కొంది. 

క్లీన్​ ఎనర్జీతో 1.5 లక్షల మరణాలకు అడ్డుకట్ట

వంటింట్లో కట్టెలతో వంట చేయడంతో పొల్యూషన్​ మరింత ఎక్కువగా ఉంటుందని, అయితే.. భారత్​లోని రూరల్​ ఏరియాల్లోనూ ఎల్​పీజీ గ్యాస్​ వినియోగం పెరగడం ఓ మంచి పరిణామమని హెచ్​ఈఐ అభిప్రాయపడింది. 2016లో ప్రారంభమైన ప్రధానమంత్రి ఉజ్వల్​ యోజన కింద పల్లెల కూడా సబ్సిడీ కింద ఎల్పీజీ గ్యాస్​ అందజేస్తుండటంతో దాన్ని వినియోగించేవాళ్లు పెరిగారని పేర్కొంది. గతంతో పోలిస్తే భారత్​లోని రూరల్​ ఏరియాల్లో ఉజ్వల్​ వల్ల 3రెట్లు ఎల్పీజీ వాడకం పెరిగిందని తెలిపింది. గాలి కాలుష్యం (పీఎం 2.5 రేట్​)ను 30 శాతం క్లీన్​ ఎనర్జీ తగ్గిస్తుందని, ఎల్పీజీ వినియోగం ఇంకా పెరగాల్సి ఉందని నివేదిక పేర్కొంది. దీని వల్ల సంవత్సరానికి 1.5లక్షల మరణాలను అరికట్టవచ్చని హెచ్​ఈఐ తన రిపోర్టులో ప్రస్తావించింది.  

హైబీపీ తర్వాత పొల్యూషన్​ మరణాలే ఎక్కువ

ప్రపంచంలో మరణాలకు అధిక రక్తపోటు మొదటి కారణమైతే.. రెండో కారణంగా ఎయిర్​ పొల్యూషన్​ అవతరించిందని హెల్త్​ ఎఫెక్ట్స్ ఇన్​సిట్ట్యూట్​ (హెచ్​ఈఐ) తన నివేదికలో పేర్కొంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 79 లక్షల మంది గాలి కాలుష్యం కారణంగా చనిపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. 

10 ఎయిర్​ పొల్యూషన్​ మరణాల్లో 9 ఎన్​సీడీ కేసులే!

భారత్​ సహా సౌత్​ ఏసియాలోని మిగతా దేశాల్లో చాలా మంది శ్వాస సమస్యలతో బాధపడుతున్నారని, ఇందుకు ఎయిర్​ పొల్యూషనే కారణమని హెచ్​ఈఐ ఆందోళన వ్యక్తం చేసింది.  2013 నుంచి 2023 మధ్య భారత్​లో గాలి కాలుష్యం పెరుగుతూ వచ్చిందని తెలిపింది. అనేక మంది ఊపిరితిత్తుల క్యాన్సర్​ బారినపడుతున్నారని.. గుండెపైనా ఎయిర్ పొల్యూషన్​ తీవ్ర ప్రభావం చూపుతున్నదని.. గుండె జబ్బులకు గాలి కాలుష్యమే 35 శాతం కారణమవుతున్నదని పేర్కొంది.  మెదడు, నాడీ వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయని.. మతిమరుపు రావడానికీ ఇదీ ఓ కారణమేనని గుర్తించింది. వాయు కాలుష్యం వల్ల జరిగే ప్రతి 10 మరణాల్లో దాదాపు 9 వరకు గుండె జబ్బులు, బ్రెయిన్​ స్ట్రోక్ , క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల (ఎన్​సీడీ) వల్ల సంభవిస్తు న్నాయని నిర్ధారించింది. గాలి కాలుష్యం పెరుగుతూ పోతే గుండె జబ్బులు, మతిమరుపు రోగానికీ ఇదే ప్రధాన కారణం అయ్యే అవకాశం లేకపోలేదని ప్రస్తావించింది. చిన్నా పెద్ద అనే వయసుతో తేడా లేకుండా అందరిలోనూ ఎయిర్​ పొల్యూషన్​ వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటున్నదని, మతిమరుపు సమస్య కనిపిస్తున్నదని పేర్కొంది. భారత్​లో గాలికాలుష్యాన్ని నివారించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌ను కఠినంగా అమలు చేయాలని ఈ నివేదిక సూచించింది.