సైక్లోన్ ప్రభావంతో వారంలో చిరుజల్లులు
మెరుగుపడనున్న ఎయిర్ క్వాలిటీ
ప్రచారం కోసం కాదు.. పరిష్కారానికి ట్రై చేయండి
కేజ్రీవాల్కు జవదేకర్ హితవు
ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎయిర్ పొల్యూషన్ శనివారం కాస్త తగ్గుముఖం పట్టింది. గురు, శుక్ర వారాల్లో అత్యంత తక్కువ స్థాయికి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ శనివారం కొంత మెరుగుపడింది. సైక్లోన్ ‘మహా’ ప్రభావంతో గాలి వేగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఢిల్లీలో ప్రస్తుతం గంటకు 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వివరించారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ 482 పాయింట్లు ఉండగా.. శనివారం కొంత మెరుగుపడి ఉదయం 10 గంటల ప్రాంతంలో 407 పాయింట్లకు చేరింది. ఘజియాబాద్, గ్రేటర్ నోయిడాలలో కూడా ఎయిర్ క్వాలిటీ కొంత మెరుగుపడిందని అధికారులు చెప్పారు. తుపాను ప్రభావంతో ఈ నెల 7, 8 తేదీలలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని చెప్పారు. తేలికపాటి జల్లులే కురిసినా.. వర్షం వల్ల పొల్యూషన్ తగ్గుతుందన్నారు. పంటపొలాల్లో వ్యర్థాల కాల్చివేత వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని చెప్పారు.
కేజ్రీవాల్ బ్లేమ్గేమ్: జవదేకర్
పొల్యూషన్ అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్బ్లేమ్గేమ్ ఆడుతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. పంజాబ్, హర్యానా సీఎంలకు లెటర్ రాయాలంటూ స్కూలు పిల్లలకు చెప్పడం ద్వారా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు చేయడం మాని పొల్యూషన్ సమస్యకు పరిష్కార మార్గాలు వెతకాలని ఆయన హితవు పలికారు. ఢిల్లీ సర్కారు అడ్వర్టైజ్మెంట్లపై 1500 కోట్లు ఖర్చు పెట్టడం కంటే ఆ డబ్బులు పంజాబ్, హర్యానాల్లోని రైతులకు అందించి, పంటల వ్యర్థాల నిర్వహణకు ఉపయోగించాలని సూచిస్తే బాగుండేదని మంత్రి అన్నారు. పదిహేనేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు మోడీ సర్కారు పరిష్కారం వెదికేందుకు ప్రయత్నిస్తోందని, ఎన్సీఆర్ మంత్రులు, అధికారులతో ఇంటర్ స్టేట్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని జవదేకర్ పిలుపునిచ్చారు.
అందర్నీ ఒక్కతాటిపైకి తేవాలి: అమరీందర్ సింగ్
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిందని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. పొల్యూషన్ను కంట్రోల్ చేసే విషయంలో పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని చెప్పారు. ఈ విషయంపై ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోడీకి ఓ ఎమోషనల్ లెటర్ రాశారు. ఢిల్లీలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని పంజాబీలు మరువబోరని అన్నారు. ఓవైపు దేశ రాజధానిని కాలుష్య మేఘాలు కమ్ముకుంటుంటే మరోవైపు దేశం అభివృద్ధి చెందుతోందని ఎలా చెప్పుకోగలమని ప్రశ్నించారు. మనుషుల తప్పిదాలతో పరిస్థితి ఇంత దారుణంగా తయారుకావడం దురదృష్టకరమని అమరీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పంజాబ్ బాధ్యతను తాను మరవడంలేదన్నారు. పంట పొలాల్లో వ్యర్థాలను తగలబెట్టొద్దని రైతులను కట్టడి చేస్తున్నామని, దీనిని ఉల్లంఘించిన వారికి ఫైన్ విధిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకున్నా ఈ విధానాన్ని అమలు చేయక తప్పడంలేదన్నారు. పంటల వ్యర్థాల నిర్వహణకు ప్రతీ క్వింటాలుకు రూ.వంద అదనంగా చెల్లించాలని ప్రధాని మోడీకి తాను పర్సనల్గా సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా అమరీందర్ గుర్తుచేశారు.