ఫ్యాన్ వార్‌కు ఫుల్‌స్టాప్.. 34 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో అజిత్, విజయ్..!

ఫ్యాన్ వార్‌కు ఫుల్‌స్టాప్.. 34 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో అజిత్, విజయ్..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో  తల అజిత్ కుమార్, దళపతి విజయ్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.  ముఖ్యంగా తమిళనాట థియేటర్లలో వీరి సినిమాలు విడుదలవుతున్నాయంటే ఫ్యాన్స్ మధ్య జరిగే యుద్ధాలు, పాలాభిషేకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై ప్రత్యర్థులుగా, అభిమానుల మధ్య రసవత్తర పోరుకు కారణమైన ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు.

బ్రిటన్‌లోని ప్రసిద్ధ 'సిల్వర్‌స్టోన్' రేసింగ్ ట్రాక్‌పై ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ 'మిషెలిన్ లీ మ్యాన్స్ కప్' పోటీల్లో అజిత్ కుమార్ తన రేసింగ్ టీమ్‌తో కలిసి స్పీడ్ కింగ్‌గా దూసుకెళ్లనున్నారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఈ రేసును  పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో అభిమానుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్న శత్రుత్వపు కథనాలకు చెక్ పెడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఇద్దరు స్టార్ల కలయిక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా మాట్లాడిన అజిత్, విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మేము సినీ రంగంలో 34 ఏళ్లుగా సహచరులం. విజయ్ ముఖ్యమంత్రి కావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తన బిజీ షెడ్యూల్‌లోనూ సమయం కేటాయించి సిల్వర్‌స్టోన్‌కు వచ్చి మాకు మద్దతు తెలపడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అని అజిత్ ఆనందం వ్యక్తం చేశారు. కేవలం స్నేహం కోసమే కాకుండా, చెన్నై  లో 'లీ మ్యాన్స్' వంటి అంతర్జాతీయ మోటార్ రేసింగ్ ఈవెంట్లను నిర్వహించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్‌ను పరిశీలించేందుకు సీఎం విజయ్ ఈ ఆహ్వానాన్ని ఆమోదించారు.

స్కాట్లాండ్, వేల్స్ వంటి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది అభిమానులు లండన్ చేరుకుని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఒకవైపు పొలిటికల్ పవర్ హౌస్‌గా విజయ్, మరోవైపు రేస్ ట్రాక్‌పై స్పీడ్ స్టార్‌గా అజిత్ సాధిస్తున్న విజయాలు చూసి ఇరువైపులా ఉన్న అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.