బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘అఖండ2: తాండవం’ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. శుక్రవారం బెంగళూరులో ఈ మూవీ ట్రైలర్ను లాంచ్ చేశారు. కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ అతిథిగా హాజరై మూవీ టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు.
బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. ‘అఖండ’ ఫస్ట్ పార్ట్లో పిల్లలు, ధర్మం, ప్రకృతి జోలికి ఎవరైనా వస్తే భగవంతుడు మనిషిలో ఆవహిస్తాడని చూపించాం. ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మాన్ని చూడబోతున్నారు. యువత పెడదారిన పడకుండా సన్మార్గంలో నడవాలని చూపించబోతున్నాం. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. నటీనటులంతా తమ పాత్రలకు ప్రాణం పోశారు” అని చెప్పారు. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత గోపీ ఆచంట, హీరోయిన్ సంయుక్త మీనన్, నటి హర్షాలీ మల్హోత్రా, విలన్గా నటించిన ఆది పినిశెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనానికి.. కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించడం కోసం.. మహా కుంభమేళా వేదికగా భారీ కుట్రకు ప్లాన్ చేస్తారు విలన్ గ్యాంగ్. దానిని తిప్పికొట్టే వీరుడిగా బాలకృష్ణ పవర్ఫుల్ లుక్లో కనిపించారు. కంప్లీట్ మాసివ్గా, యాక్షన్ విజువల్స్తో ఉన్న ట్రైలర్ ఆకట్టుకుంది. ‘ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు కనిపించేది ఒక మతం.. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం.. సనాతన హైందవ ధర్మం’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
‘దేశం జోలికొస్తే మీరు దండిస్తారు. దైవం జోలికొస్తే మేం ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రయిక్’ అని చెబుతూ విలన్స్పై బాలయ్య విరుచుకుపడిన విధానం హైప్ను క్రియేట్ చేసింది. ఆది పినిశెట్టి అఘోరా గెటప్లో తనదైన విలనిజాన్ని పండించాడు. బాలయ్య మార్క్ డైలాగ్స్, బోయపాటి మాసివ్ టేకింగ్కితోడు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు క్యూరియాసిటీని పెంచింది.
