
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్ గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేశారు. కాగా.. జనవరి 19న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, మరిది జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా.. భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్ట్.. జగత్ విఖ్యాత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనుంది.
బోయిన్పల్లి పీఎస్ పరిధిలో జనవరి 5న రాత్రి 8 గంటల సమయంలో ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను కొంతమంది వ్యక్తులు ఇన్కంటాక్స్ ఆఫీసర్ల ముసుగులో కిడ్నాప్ చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై.. సీసీటీవీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గంటల్లోనే కేసును చేధించారు. పోలీసుల అలర్ట్తో నిందితులు.. కిడ్నాప్ చేసిన ముగ్గురిని వదిలి పారిపోయారు. దర్యాప్తులో భాగంగా జనవరి 6న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం పోలీసులు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అఖిలప్రియను చంచల్ గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి అనుమతి ఇస్తూ జనవరి 11న సికింద్రాబాద్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులు చంచల్ గూడ జైలు నుంచి అఖిలప్రియను కస్టడీలోకి తీసుకున్నారు. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించి.. మూడు రోజుల పాటు విచారించారు. జనవరి 14న అఖిలప్రియ కస్టడీ పూర్తయింది. దాంతో మరోసారి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి చంచల్ గూడ జైలుకు తరలించారు. జనవరి 16న అఖిలప్రియ తరపు లాయర్ బెయిల్ పిటీషన్ కోసం దాఖలు చేశారు. జనవరి 18న అఖిలప్రియ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ సికింద్రాబాద్ కోర్ట్ తీర్పు చెప్పింది. జనవరి 19న అఖిలప్రియ మరోసారి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన సెషన్స్ కోర్టు.. జనవరి 22న అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేసింది.
For More News..