
ఆసియా కప్–2025 కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొత్తం 15 మందితో కూడిన జట్టును మంగళవారం (ఆగస్టు 19) అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసింది. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ టీమిండియాను ఆసియా కప్లో నడిపించనుండగా.. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్కు అప్పగించింది బీసీసీఐ. ఈ నిర్ణయం టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ను కాస్తా నిరాశకు గురి చేసింది. టీమిండియా చివరగా ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్కు భారత టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించారు.
ఈ సిరీస్కు హార్ధిక్ పాండ్యాను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన బీసీసీఐ.. ఆ బాధ్యతలను ఆల్ రౌండర్ అక్షర్ పటేల్కు అప్పగించింది. తాజాగా ప్రకటించిన ఆసియా కప్ జట్టులో మరోసారి టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ మారారు. ఈ సారి అక్షర్ పటేల్ను పక్కకు పెట్టి.. ఇటీవల భారత టెస్ట్ జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టిన శుభమన్ గిల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది బీసీసీఐ. దీంతో అక్షర్ పటేల్ది ఒక్క సిరీస్ మురిపెం అయ్యింది. వైస్ కెప్టెన్గా అక్షర్ను కేవలం ఒక్క సిరీస్కే పరిమితం చేసింది బీసీసీఐ.
Also read:-పూణే రెస్టారెంట్ వింత ఆలోచన: ఫుడ్ వేస్ట్ చేస్తే ఏం చేస్తారంటే.. ఆన్లైన్లో రచ్చ..
అయితే.. ఆసియా కప్కు తిరిగి పాండ్యాకు టీ20 వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా యంగ్ ప్లేయర్ గిల్ వైపే మొగ్గు చూపింది బీసీసీఐ. ఇప్పటికే భారత జట్టు కెప్టెన్గా ఎన్నికైన గిల్ త్వరలోనే భారత జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆసియా కప్ పగ్గాలు గిల్కు అప్పగించినట్లు చర్చ నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. దీంతో వన్డే జట్టు పగ్గాలు కూడా త్వరలోనే గిల్ స్వీకరించే ఛాన్స్ ఉంది.
2025, సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కానుంది. ఆసియా 2025లో మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్గా 19 మ్యాచ్లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యుఎఇతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్తో గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది.
2025 ఆసియా కప్కు భారత జట్టు ప్రకటన:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా