
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా, ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ పంచాయితీ చివరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరకు చేరింది. తుర్కపల్లి మండలానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్ సస్పెన్షన్ ఎత్తివేతపై కేటీఆరే నిర్ణయం తీసుకుంటారని మంత్రి జగదీశ్రెడ్డి తేల్చిచెప్పారు. ఇటీవల తుర్కపల్లి మండల టీఆర్ఎస్ కమిటీ ఎన్నిక సందర్భంగా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత.. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్ సహా ఐదుగురిని సస్పెండ్ చేశారు. ఈ వివాదం పార్టీలో కలకలం సృష్టించింది. తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ పడాల శ్రీనివాస్ సోమవారం భారీ సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కేడర్ను హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్కు తరలించారు. మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి పార్టీతో సంబంధాలు లేని వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతో కార్యకర్తలు కొంత ఆవేశపడ్డారని, గొడవతో ఎలాంటి సంబంధం లేని తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని పడాల శ్రీనివాస్ మంత్రికి వివరించారు. ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని, కేటీఆర్ఈ ఘటనపై అసంతృప్తిగా ఉన్నారని మంత్రి ఆయనకు చెప్పారు. కేటీఆర్ నిర్ణయం తీసుకునేదాక సైలెంట్గా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు, ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వేర్వేరుగా మంత్రిని కలిసి సస్పెన్షన్ వ్యవహారంపై వివరించినట్టు తెలిసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వివరించారని సమాచారం. సస్పెన్షన్ ఎత్తి వేయకుంటే కేసీఆర్ ఫాంహౌజ్కు వెళ్లి తేల్చుకుంటామని పడాల శ్రీనివాస్ వర్గం తేల్చిచెప్తోంది.