రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు చేశా

రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు చేశా
  •     రూ.172 కోట్లకు ప్రతిపాదనలు పంపా
  •     ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య 

యాదాద్రి, వెలుగు : తాను గెలిచిన వంద రోజుల్లోనే రూ.100 కోట్లు నిధులతో అభివృద్ధి పనులు చేశానని, మరో రూ.172 కోట్లకు ప్రతిపాదనలు పంపానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను పెత్తనం చేసే నాయకుడిని కాదని, ప్రజల కోసం పనిచేసే సేవకుడినని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయి అమ్మకాలపై పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకునే విధంగా చూస్తానని తెలిపారు.

యాదగిరిగుట్ట టెంపుల్​ఉద్యోగులు​నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే ప్రక్షాళన చేస్తామన్నారు. టెంపుల్​పునర్నిర్మాణం కారణంగా నష్టపోయినవారికి ఉపాధి కల్పిస్తామని, షాపులు కోల్పోయిన వారికి కొత్తగా షాపులు ఇప్పిస్తామని చెప్పారు. కొండపైన భక్తులకు వసతులు సమకూరుస్తున్నామని తెలిపారు. రూ.20 కోట్లతో రెండు వేల మంది భక్తులకు నిద్రించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.

తాగునీటి అవసరాల  కోసం రూ.2 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. బునాదిగాని కాల్వ పనులు త్వరలో పూర్తి చేయిస్తానన్నారు. బీడీ కార్మికులకు హాస్పిటల్స్​సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తానని, ఇందిరమ్మ ఇండ్లలో బీడీ కార్మికులకు ప్రయారటీ ఇస్తామని తెలిపారు. ఎంపీపీ చీర శ్రీశైలం, నీలం పద్మ, జనగామ ఉపేందర్​రెడ్డి, అండెం సంజీవరెడ్డి పాల్గొన్నారు.