బీజేపీలో చేరనున్న మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కు షాక్

బీజేపీలో చేరనున్న మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కు షాక్

పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలకు కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెరదించారు. ఏప్రిల్ 13వ తేదీ గురువారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ తో సమావేశం అయ్యారు మహేశ్వర్ రెడ్డి. ఆయన వెంట రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. తరుణ్ చుగ్ తో సమావేశం తర్వాత.. ఢిల్లీలో ఉన్న బీజేపీ కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు మహేశ్వర్ రెడ్డి.

ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం కంటే ముందే.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. తనకు పీసీసీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన.. బీజేపీ నేతలతో అక్కడ భేటీ అయ్యి.. రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో భేటీ అయ్యారు. 

కొంతకాలం నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి. చాలాసార్లు బహిరంగంగానే రేవంత్ పై విమర్శలు చేశారు. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతున్నారంటూ ప్రచారం జరిగింది. నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులు, నేతలతో మహేశ్వర్ రెడ్డి భేటీ అయ్యి.. భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. ఈ క్రమంలోనే ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. ఫిర్యాదులు అందుతున్నాయని, గంటలోగా వాటికి జవాబు చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి కోరారు. దీనిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. పలువురు నేతలపై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో గ్రూపులు సహజమేనని చెప్పారు. తనది బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తిత్వం కాదని మండిపడ్డారు. పార్టీ నుంచి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఏఐసీసీ లీడర్ అయిన తనకు పీసీసీ నోటీసులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. 

కొంతకాలంగా పీసీసీ చీఫ్ పై అసంతృప్తిగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు బుజ్జగింపులు చేశారు. 13 ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉంటున్న తాను.. పార్టీకి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదని, నడుచుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ లోని కొందరు నాయకులు బీజేపీ అగ్రనాయకులతో కలిసినా వారికి ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా.. తనకు మాత్రమే ఇస్తారా..? అని ప్రశ్నించారు.