డాక్టర్లు దేవుడి ప్రతినిధులు.. నేనూ వ్యాక్సిన్ తీసుకుంటా..

డాక్టర్లు దేవుడి ప్రతినిధులు.. నేనూ వ్యాక్సిన్ తీసుకుంటా..

అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబా.. తన నిర్ణయం మార్చుకున్నారు. తనకు వ్యాక్సిన్ అవసరం లేదని.. యోగా, ఆయుర్వేదం తనకు రక్షణ కల్పిస్తుందని గతంలో రాందేవ్ బాబా చెప్పారు. జూన్ 21 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. దాంతో.. రాందేవ్ బాబా తన నిర్ణయం మార్చుకుని త్వరలోనే వ్యాక్సిన్ తీసుకోబోతున్నట్టు తెలిపారు. 

కొన్ని రోజుల క్రితం రాందేవ్ బాబా అల్లోపతి వైద్యం మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కోవిడ్ టీకాపై తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో రామ్‌దేవ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని గత వారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా.. అల్లోపతికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలపై రాందేవ్ బాబాకు లీగల్ నోటీసు పంపింది. 

ప్రధాని ప్రకటనతో మనసు మార్చుకున్న బాబా.. యోగా, ఆయుర్వేదంతో పాటు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే అది డబుల్ ప్రొటెక్షన్ ఇస్తుందన్నారు. అల్లోపతి డాక్టర్లు దేవుడు పంపిన ప్రతినిధులంటూ  రాందేవ్ బాబా కొనియాడారు. కాగా.. ఆక్సిడెంట్లు, ఎమర్జెన్సీ  కేసుల్లో అల్లోపతి వైద్యం చాలా బాగా పనిచేస్తుందన్న ఆయన.. నయం కాని జబ్బుల విషయంలో మాత్రం ఆయుర్వేదమే మంచిదని వ్యాఖ్యానించారు.