క్యాడర్​తో భేటీలు..కార్నర్​ మీటింగులు!

క్యాడర్​తో భేటీలు..కార్నర్​ మీటింగులు!
  • నాగర్​కర్నూల్​లో ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

నాగర్​కర్నూల్, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల్లో నాగర్​ కర్నూల్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​లు నిర్వహిస్తుండగా, బీఆర్ఎస్​ నేతలు కార్యకర్తల సమావేశాలపై దృష్టి పెట్టారు. ముందుగా బీజేపీ సిట్టింగ్​ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు భరత్​ప్రసాద్​ను క్యాండిడేట్​గా ప్రకటించింది. ఆ తరువాత కాంగ్రెస్​ క్యాండిడేట్​గా మాజీ ఎంపీ మల్లు రవి పేరు ఖరారైంది. బీఎస్పీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్​లో చేరిన ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల వచ్చిన పండుగలను అన్ని పార్టీల నాయకులు ప్రచారానికి వినియోగించుకున్నాయి.

కాంగ్రెస్​ క్యాండిడేట్​ సుడిగాలి పర్యటనలు..

కాంగ్రెస్​ క్యాండిడేట్​ మల్లు రవి రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​లతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకే రోజు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలు కవర్​ అయ్యేలా రోడ్​ షోలు ప్లాన్​ చేసుకుంటున్నారు. ఇప్పటికే అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్​ కర్నూల్​ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి, సతీశ్​ మాదిగ తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. 

నాగర్​ కర్నూల్​ పార్లమెంట్​ నియోజకవర్గ ఎన్నికల ఇన్​చార్జి, మంత్రి జూపల్లి కృష్ణారావు తన నియోజకవర్గమైన కొల్లాపూర్ తో పాటు పక్కనే ఉన్న వనపర్తి, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించాల్సి ఉంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్లానింగ్​ బోర్డ్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్, గద్వాల జడ్పీ  చైర్​పర్సన్​ సరిత తదితరులు ఎన్నికల ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. బీజేపీ మతతత్వ, విభజన రాజకీయాలకు పాల్పడుతోందని మల్లు రవి తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తమ కుటుంబ స్వార్థం కోసం బలి చేసిన కేసీఆర్​ ఫ్యామిలీ రాజకీయాలకు ఈ ఎన్నికలు చివరివి కావాలని కాంగ్రెస్​ నేతలు ప్రస్తావిస్తున్నారు.

ముమ్మరంగా బీజేపీ ప్రచారం..

బీజేపీ క్యాండిడేట్​కు మద్దతుగా ప్రధాని మోదీ నాగర్​ కర్నూల్​ బహిరంగ సభలో పాల్గొన్నారు. కల్వకుర్తి, నాగర్​ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ఎంపీ రాములు, పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. భరత్​కు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్​ రావు, వనపర్తి జడ్పీ చైర్మన్​ లోక్​నాథ్​ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​ జక్కా రఘునందన్​రెడ్డి, ఆచారి,  దిలీపాచారి తదితరులు వాకర్స్​ మీటింగ్స్, స్ట్రీట్​ కార్నర్​ మీటింగ్స్​ నిర్వహిస్తున్నారు. 

మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అయోధ్య రామాలయ నిర్మాణం, అవినీతి, అక్రమాలు, ఫోన్​ ట్యాపింగ్, కవిత లిక్కర్​ కేసు, మేడిగడ్డ కుంగుబాటుతో పాటు కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని బీజేపీ నేతలు తమ ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా వాడుతున్నారు. ఇదిలాఉంటే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, నాగర్​ కర్నూల్​ ఎంపీగా పోటీ చేసిన బంగారు శృతి ప్రచారంలో కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్  కార్యకర్తలతో మీటింగ్​లు..

పొత్తు ధర్మానికి కట్టుబడి బీఎస్పీ నుంచి బీఆర్ఎస్​లో చేరిన ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గద్వాల, అలంపూర్​ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి, విజయుడు, మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్​రెడ్డి, జైపాల్​ యాదవ్, బీరం హర్షవర్దన్​రెడ్డి తదితరులు మీటింగ్​లను​ఏర్పాటు చేస్తున్నారు. 

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్​రెడ్డి మినహా మిగిలిన వాళ్లు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇదిలాఉంటే బీఎస్పీ అధ్యక్షుడిగా ఆర్ఎస్పీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను ఆయన ప్రత్యర్థులు, బీఎస్పీ నాయకులు సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తున్నారు.