
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో ఇంటర్ తప్ప మిగిలిన తరగతులకు సీట్లు ఫుల్ అయ్యాయని ఎస్సీ గురుకులాల సెక్రటరీ డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణి తెలిపారు. ఈ నెల31న జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోసం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. మంగళవారం డీఎస్ఎస్ భవన్ లోని గురుకులాల కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. గురుకులాల అడ్మిషన్లపై వస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు.
మెరిట్ లిస్ట్ ఆధారంగానే సీట్ల భర్తీ జరిగిందన్నారు. సీట్లు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ఖాళీల వివరాలను ఈ నెల 30న వెబ్ సైట్ లో పెడతామని వెల్లడించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలను పరిశీలించి సీట్లు ఇస్తామన్నారు. కాగా.. క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త మెనూ టెండర్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు.