కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో అన్నీ అబద్ధాల హామీలు: మోడీ

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో అన్నీ అబద్ధాల హామీలు: మోడీ

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతల ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగానే ప్రధాని మోడీ ఇవాళ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తూర్పు సియాంగ్‌ జిల్లా పాసిఘాట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని…. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో పేరుతో అబద్ధపు హామీల చిట్టాను ప్రజల ముందుంచిందన్నారు. గతంలో కూడా ఇలాగే హామీలిచ్చి కాంగ్రెస్‌ ఎదురు దెబ్బతిందని తెలిపారు. ఇప్పుడు కూడా అలాంటి హామీలే ఇస్తోందన్నారు. ప్రజలను తెలివితక్కువ వారిని చేసేందుకు అబద్దాలతో మానిఫెస్టో తయారుచేసిందని… అది మేనిఫెస్టో కాదు. అబద్దాల హామీలన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే ఆ పార్టీ పనిచేస్తుందన్నారు. కానీ మేం ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు మోడీ. రైతులను మోసం చేసి ఓట్లు అడిగే పార్టీ తమది కాదన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తామన్నారు. ఈ ఎన్నికలు నమ్మకానికి, అవినీతికి, నిబద్ధతకు, కుట్రకు మధ్య జరుగుతున్న పోరు అని అన్నారు మోడీ.