
హైదరాబాద్, వెలుగు: పార్టీ మారినోళ్ల ఇండ్ల ముందు ఏ డప్పు కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు ఫిర్యాదు చేయడానికి ఎన్నిసార్లు వెళ్లినా ఆయన అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. అపాయింట్మెంట్ కోసం అడిగినా సమయం ఇవ్వడం లేదన్నారు.
సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి ఇండ్ల ముందు చావు డప్పు కొట్టమన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటోంది. మరి ఆ ఎమ్మెల్యేల ఇంటి ముందు ఏ డప్పు కొట్టాలో చెప్పాలి” అని ఏలేటి డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేస్తామని తెలిపారు.