
అమరావతి, వెలుగు: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శుక్రవారం నుంచి సకల జనుల సమ్మె తలపెట్టినట్లు అమరావతి సాధన జేఏసీ ప్రకటించింది. 16 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందనలేదని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ నేతలు చెప్పారు . సమ్మెలో భాగంగా 29 గ్రామాల్లోనూ ఆందోళనలు ప్రారంభిస్తామన్నారు. రిలే నిరాహార దీక్షలు, మహా ధర్నాలు కొనసాగిస్తామన్నారు. విజయవాడ, గుంటూరు నుంచి అమరావతికి వచ్చే రోడ్లను బ్లాక్చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. రాజధాని రైతుల హక్కులు కాపాడుకోవడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. శుక్రవారం నుంచి అమరావతి పరిధిలో ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాల సరఫరా తప్ప మిగిలిన వ్యాపారాలన్నీ మూతపడతాయని చెప్పారు. దుకాణాలను స్వచ్ఛందంగా మూసేందుకు వ్యాపారులు ఒప్పుకున్నారని, వారూ సమ్మెలో పాల్గొంటారని జేఏసీ నేతలు తెలిపారు.
16 వ రోజు సెక్రటేరియట్ రూట్ బంద్
అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ 16 వ రోజైన గురువారం రైతులు ఆందోళన కొనసాగించారు. విజయవాడ నుంచి సెక్రటేరియట్చేరుకునే మందడం ప్రధాన రహదారిపై టెంట్వేసి మహాధర్నా చేపట్టారు. టెంట్తొలగించేందకు ప్రయత్నించిన పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల జోక్యంతో రైతులు వెనక్కి తగ్గారు. రోడ్డు పక్కన టెంట్వేసి నిరసన తెలపారు. మందడంతో పాటు తుళ్లూరు, నేలపాడు, నవులూరు వెలగపూడి, వెంకపాలెం గ్రామాల్లో రైతులు యథావిధిగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమను మోసం చేసేందుకు ప్రభుత్వం బూటకపు కమిటీలతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.16 రోజులగా సీఎం, మంత్రులు పోలీస్ భద్రత మధ్య సెక్రటేరియట్కు వెళ్తున్నారన్నారు, అమరావతి విషయంలో సీఎం, మంత్రులది తప్పుడు నిర్ణయం కాకపోతే తమ గ్రామాల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమరావతి కోసం ఎన్ని నెలలైనా ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు చెప్పారు.
పల్లె ప్రగతిపై మానిటరింగ్ సెల్
హైదరాబాద్, వెలుగు: పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్కమిషనరేట్లో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ఊర్లలో చేసిన పనులు, ఫ్లయింగ్స్క్వాడ్ల తనిఖీలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు సీఎంవోకు అందజేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఫ్లయింగ్స్క్వాడ్లకు గైడ్లైన్స్ అందజేశామని, మార్చి 31వ తేదీకల్లా తనిఖీల నివేదికలు ఇవ్వాలని సూచించామని ఉన్నతాధికారులు తెలిపారు.
పది రోజుల పాటు
పదిరోజుల పాటు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించి.. ప్రతి రోజు చేసిన కార్యక్రమాల వివరాలు, ఫోటోలు, వీడియోలను జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవోలు) మానిటరింగ్సెల్కు పంపుతారు. అధికారులు వాటిని పరిశీలించి, సమగ్ర నివేదికలను శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్కు, సీఎస్కు, సీఎం కార్యాలయానికి పంపుతారు. పంచాయతీరాజ్ కమిషనర్ రఘనందన్ రావు, డిప్యూటీ కమిషనర్, డీపీవో, సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు మానిటరింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
51 మంది ఉన్నతాధికారులతో ఫ్లయింగ్ స్వ్కాడ్ లు
గ్రామాల్లో చేసిన పనులను ఫ్లయింగ్ స్క్వాడ్లతో ఆకస్మిక తనిఖీలు చేయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఐఏఎస్లు 19 మంది ఉండగా.. ఐపీఎస్లు 11 మంది, ఐఎఫ్ఎస్లు 21 మంది ఉన్నారు. వీరంతా 2వ తేదీన పల్లె ప్రగతి ప్రారంభం సందర్భంగా గ్రామసభలకు హాజరుకానున్నారు.రెండో తేదీ నుంచి వారు తమకు కేటాయించిన మండలాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. మార్చి 31వ తేదీ కల్లా ప్రతి అధికారి సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. వారికి పల్లెప్రగతి గైడ్ లైన్స్, కేటాయించిన మండలాల వివరాలు, స్థానిక అధికారుల ఫోన్ నంబర్లతో కిట్ ను అందచేశారు.