- సచిన్ జమ్మూ కాశ్మీర్ పర్యటనపై ప్రధాని మోదీ స్పందన
న్యూఢిల్లీ: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల జమ్మూకాశ్మీర్లో పర్యటించారు. అందుకు సంబంధించిన ఓ చిన్న వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కాశ్మీర్ పర్యటన తన జ్ఞాపకాల్లో ఒక అందమైన అనుభవంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. ‘‘ఇక్కడ చుట్టూ మంచుతో కప్పబడి ఉంది.. అయినప్పటికీ ఇక్కడ ప్రజల అసాధారణమైన ఆతిథ్యం చాలా గొప్పగా అనిపించింది. మన దేశంలో చూడటానికి చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ పర్యటన తర్వాత మోదీ వ్యాఖ్యలతో అంగీకరించకుండా ఉండలేకపోతున్నాను.
కాశ్మీర్లో తయారయ్యే విల్లో క్రికెట్ బ్యాట్లు ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’కి గొప్ప ఎగ్జామ్పుల్. ఈ బ్యాట్లను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఇన్క్రెడబుల్ ఇండియా’లోని ఆభరణాల్లో ఒక్కటైన జమ్మూకాశ్మీర్ను వచ్చి సందర్శించాలని నేను అందరిని కోరుకుంటున్నాను”అని సచిన్ పేర్కొన్నారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇన్క్రెడబుల్ ఇండియా గురించి చెప్పడం అద్భుతమంటూ సచిన్ను కొనియాడారు. ‘‘సచిన్ టెండూల్కర్ జమ్మూకాశ్మీర్ పర్యటనలో యువతకు రెండు ముఖ్యమైన అంశాలు చెప్పారు. ఒకటి ఇన్క్రెడబుల్ ఇండియాలోని వివిధ ప్రాంతాలు ఉన్నాయి.. రెండు మేక్ ఇన్ ఇండియా ప్రాముఖ్యత.. ఈ సందర్భంగా మనమందరం కలిసి వికసిత్, ఆత్మనిర్భర భారత్’’ను నిర్మిద్దాం అంటూ ప్రధాని పిలుపునిచ్చారు.