హైదరాబాద్‌‌‌‌లో అమెజాన్‌‌‌‌ భారీ పెట్టుబడి

హైదరాబాద్‌‌‌‌లో అమెజాన్‌‌‌‌ భారీ పెట్టుబడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో భారీ పెట్టుబడికి అమెజాన్‌‌‌‌ ముందుకు వచ్చింది. 2030 నాటికి రూ.36,300 కోట్లతో వెబ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ను విస్తరిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. హెచ్‌‌‌‌ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన చేసింది. దావోస్‌‌‌‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌‌‌‌ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమెజాన్‌‌‌‌ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అత్యుత్తమ క్లౌడ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ అందించేందుకు అమెజాన్‌‌‌‌ చందన్‌‌‌‌వెల్లిలోని ఫ్యాబ్‌‌‌‌ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేసింది. మొదటి దశలో రూ.20,096 కోట్లు పెట్టుబడి పెట్టిన అమెజాన్‌‌‌‌.. ఇప్పుడు ఆ సేవలను విస్తరించడానికి సిద్ధమైంది. తెలంగాణకు వస్తున్న అతిపెద్ద ఎఫ్‌‌‌‌డీఐల్లో ఇది ఒకటని కేటీఆర్‌‌‌‌ అన్నారు. ఈ-గవర్నెన్స్‌‌‌‌, హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లో ప్రభుత్వ కార్యకలాపాలు మెరుగుపరచడానికి అమెజాన్‌‌‌‌ వెబ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌తో కలిసి తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ విస్తరణకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు