- రివకరీ చేసిన గోల్డ్ కూడా తనఖా పెట్టిన అంబర్పేట ఎస్ఐ
- ఇటీవల ఏపీ గ్రూప్ 2 పరీక్షలో జాబ్.. రిలీవ్ అయ్యేందుకు గన్ లేకుండా వచ్చి దొరికిండు
- సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
- అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టాస్క్ఫోర్స్
అంబర్ పేట, వెలుగు: బెట్టింగ్ యాప్స్కు బానిసైన అంబర్పేట ఎస్ఐ చివరకు తన సర్వీస్ రివాల్వర్ను కూడా తాకట్టు పెట్టే స్థాయికి దిగజారాడు. ఓ చోరీ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని కూడా కుదువ పెట్టాడు. ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్2 పరీక్షల్లో జాబ్ కొట్టిన అతడు.. రిలీవ్ అయ్యేందుకు గన్ లేకుండా వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు. ఈ సందర్భంగా రివాల్వర్తో పాటు తాకట్టు పెట్టిన రికవరీ బంగారం సంగతి కూడా బయటపడింది. దీంతో అతడిని సస్పెండ్చేసి రివాల్వర్, బంగారం ఎక్కడ పెట్టాలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలోని రాయచోటికి చెందిన భాను ప్రకాశ్ 2020 బ్యాచ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్లో పని చేశాడు. ఏడాదిన్నర క్రితం అంబర్పేట పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీ సెక్టార్ ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇంతకుముందు డిటెక్టివ్ఎస్సైగా ఉన్నప్పుడు ఓ ఇంట్లో పని మనిషి.. దొంగతనం చేసి ఓనర్కు సంబంధించిన నగలు, డబ్బు ఎత్తుకుపోయాడు. ఆ కేసు విచారించిన భానుప్రకాశ్.. దొంగను పట్టుకొని 50 గ్రాముల బంగారం రికవరీ చేశాడు. తర్వాత ఈ కేసులో పనిమనిషి, ఓనర్ లోక్ అదాలత్లో కాంప్రమైజ్అయ్యారు. అయితే, రికవరీ చేసిన బంగారాన్ని మాత్రం ఓనర్కు ఇవ్వలేదు.
బెట్టింగ్ యాప్స్కు బానిసగా మారి..
భానుప్రకాశ్ సరదాగా యాప్స్లో బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు. రూ.100, రూ.200, రూ. 500 కాస్తా.. రాను రాను రూ. వేలు, లక్షల్లోకి వెళ్లింది. దీంతో తన జీతంతో పాటు అప్పులు చేసి బెట్టింగ్యాప్స్లో పెట్టడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులు కూడా పోవడంతో బెట్టింగ్కు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. దీంతో దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులు కూడా బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఇలా రూ.70 లక్షల నుంచి రూ. 80 లక్షలు కోల్పోయాడు.
రివాల్వర్ పోతే పోనియ్ అనుకొని..
బెట్టింగ్లో డబ్బులు పోయి అప్పుల పాలైన ఎస్సై భానుప్రకాశ్కు ఎవ్వరూ ఒక్క రూపాయి ఇవ్వడానికి ముందుకు రాలేదు. దగ్గరి బంధువులు, దూరపు చుట్టాలు, స్నేహితుల దగ్గర వదలకుండా అప్పు చేసిన భానుప్రకాశ్..తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేకపోవడంతో తట్టుకోలేకపోయాడు. చివరకు తన సర్వీస్రివాల్వర్(9 ఎంఎం) ను తనకు తెలిసిన వ్యక్తి దగ్గర కుదువపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. బుల్లెట్స్ మాత్రం తీసి భానుప్రకాశ్ తన దగ్గరే పెట్టుకున్నాడు.
సస్పెన్షన్.. విచారణ
టాస్క్ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన రివాల్వర్ను తాకట్టు పెట్టినట్టు భానుప్రకాశ్ అంగీకరించాడు. దీంతో షాక్కు గురైన టాస్క్ఫోర్స్పోలీసులు.. బంగారం గురించి ఆరా తీశారు. దాన్ని కూడా తనఖా పెట్టినట్టు చెప్పాడు. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయగా.. భానుప్రకాశ్పై సస్పెన్షన్ వేటు వేశారు.
ఏపీ గ్రూప్2లో జాబ్కొట్టి...
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్2 పరీక్షల్లో భాను ప్రకాశ్ సత్తా చాటాడు. ఈ ఏడాది ఏప్రిల్4న వచ్చిన ఇంటర్వ్యూ ఫలితాల్లో అతడి పేరు రావడంతో ఆనందపడ్డాడు. అయితే, రిలీవ్ కావడానికి వెళ్తే సర్వీస్ రివాల్వర్ వాపస్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినా ఏదో ఒకటి మేనేజ్చేద్దామనే ఉద్దేశంతో బుల్లెట్స్ మాత్రం తీసుకువెళ్లాడు. అక్కడున్న అధికారులు రివాల్వర్ ఏదని ప్రశ్నించగా.. ముందు బుల్లెట్స్తీసుకోవాలని, తర్వాత రివాల్వర్ ఇస్తానని చెప్పాడు. వారు ఒప్పుకోకపోవడంతో రివాల్వర్ తన డెస్క్లో ఉందని చెప్పాడు. అనుమానం వచ్చిన వారు సీసీ కెమెరాలను పరిశీలించగా, అతడి డెస్క్లో నుంచి ఏదో ప్యాకెట్ తీసుకెళ్తు న్నట్టు కనిపించింది. దాని గురించి ఎంక్వైరీ చేయగా, అది పని మనిషి దగ్గర రికవరీ చేసిన బంగారంగా తేల్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు.
