అమ్రాబాద్, వెలుగు: మారుమూల చెంచుపెంటలో పురిటి నొప్పులతో బాధపడుతున్న చెంచు మహిళకు 108, బైక్ అంబులెన్స్ సిబ్బంది ఇంటి దగ్గరకే వెళ్లి పురుడు పోసి.. రెండు ప్రాణాలను కాపాడారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం చెంచుపెంటకు చెందిన మనెమ్మకు నెలలు నిండడంతో శనివారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు తీవ్రం కావడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబసభ్యులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. మన్ననూర్ నుంచి 108తోపాటు గవర్నర్ తమిళిసై ప్రారంభించిన బైక్ అంబులెన్స్ బయలుదేరాయి. అడవిగుండా ప్రయాణిస్తుండగా 108 అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. సిబ్బంది మల్లయ్య, సుజాత, పైలట్ వెంకటేశ్వర్లు బైక్ అంబులెన్స్ను తోసుకుంటూ 9 కి.మీ కాలినడకన వెళ్లి ప్రసవం చేశారు. మనెమ్మకు ఆడపిల్ల పుట్టింది. అనంతరం ఇద్దరినీ ఆపసోపాలు పడుతూ అంబులెన్స్ వద్దకు చేర్చి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.
