అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైలు ప్రారంభం

అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైలు ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలో అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైలు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం ఉదయం అమీర్‌పేట స్టేషన్‌లో హైటెక్‌సిటీ మెట్రో సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ రూట్లో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకు మెట్రో రైలును నడపనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో హడావుడి లేకుండా మెట్రో ప్రారంభోత్సవం జరిగింది.

అమీర్‌పేట-హైటెక్‌ సిటీ మెట్రో రైలు ప్రారంభంతో ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు. ఎల్బీనగర్‌, మియాపూర్‌ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్‌పేట్‌లో రైలు మారాల్సి ఉంటుంది. బుధవారం నుంచి మెట్రో రైలు తిరగనున్న 10 కి.మీ. మార్గంలో అమీర్‌పేటతో పాటు మధురానగర్‌, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ.. మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్లు అందుబాటులోకి రావడం లేదు. వీటి ప్రారంభానికి మరికొద్ది వారాలు పడుతుందని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

మెట్రో రైలు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.