
పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారే నటి అంటూ ఓ వైపు విమర్శలు ఎదురవుతున్నా.. సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్(Ameesha Patel) తనదైన వివాదాల పంథాను మాత్రం విడిచిపెట్టడం లేదు. వివాదాలు ఈ అమ్మడికి కొత్త కాకపోయినా మరోసారి గదర్ 2(Gadar 2) ప్రమోషన్స్ లో వివాదాలతో అంటకాగుతోంది.
తాజాగా స్వలింగ సంపర్కంపై అమీషా చేసిన ఘాటైన వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయి. ఓటీటీ వేదికలపై జరిగిన తాజా సంభాషణలో అమీషా మాట్లాడుతూ ప్రేక్షకులు క్లీన్ కంటెంట్ కోసం ఆకలితో ఉన్నారని వ్యాఖ్యానించింది. ఆధునిక ఓటీటీలు పూర్తిగా స్వలింగ సంపర్కంతో నిండి ఉన్నాయన్న వ్యాఖ్యలను సమర్థిస్తూ అమీషా మాట్లాడింది.
‘మంచి కంటెంట్ తో స్వచ్ఛమైన సినిమా కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మనవడు తాతయ్యతో కూర్చుని చూడగలిగే సినిమా తీయగలిగే యుగం ఇది కాదు. ఓటీటీ ఖచ్చితంగా మీకు ఆశించిన మంచి కంటెంట్ ను ఇవ్వదు. ఓటీటీలో స్వలింగ సంపర్కం, గే, -లెస్బియనిజం లాంటివి ఉంటున్నాయి. మీరు మీ పిల్లల కళ్లను కప్పి ఉంచాల్సిన సన్నివేశాలుంటాయి' అని వ్యాఖ్యానించింది.
అయితే అమీషా వ్యాఖ్యల్ని పూర్తిగా పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. ఓటీటీపై ఆమె చేసిన వ్యాఖ్యలతో బోలెడంత ఉచిత మీడియా కవరేజీని కొట్టేసిందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.