వాషింగ్టన్: ఆంక్షల ద్వారా అమెరికా శత్రు దేశాలకు చెక్ పెట్టే చట్టం(కాట్సా) నుంచి ఇండియాకు అమెరికా విముక్తి కల్పించింది. ఇందు కోసం ఆ దేశ ప్రతినిధుల సభ వాయిస్ ఓటుతో లెజిస్లేటివ్అమెండ్మెంట్ చేసింది. దీంతో రష్యా నుంచి ఎస్400 డిఫెన్స్ సిస్టమ్ మిస్సైళ్లు కొనుగోలు చేసి, చైనా దురాక్రమణలకు చెక్ పెట్టేందుకు ఇండియాకు మార్గం సుగమమైంది. గురువారం సమావేశమైన అమెరికా ప్రతినిధుల సభ ఈ లెజిస్లేటివ్ అమెండ్మెంట్ చేసింది. ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ మ్యాన్ రో ఖన్నా.. హౌస్లో ఈ సవరణను ప్రవేశపెట్టారు. చైనా లాంటి దేశాల నుంచి దురాక్రమణలను తిప్పికొట్టేందుకు కాట్సా నుంచి ఇండియాకు విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ను ఈ అమెండ్మెంట్ ద్వారా ఖన్నా కోరారు. ‘‘చైనా అదేపనిగా ఇండియాను కవ్విస్తోంది. రానురాను ఆ దేశ దురాక్రమణలు పెరుగుతున్నాయి. ఈ టైమ్లో మనం(అమెరికా) ఇండియాకు అండగా నిలబడాలి. చైనా ఆగడాలను ఇండియా తిప్పికొట్టేలా చూడాలి. రష్యా నుంచి ఇండియా డిఫెన్స్ మిస్సైళ్లు కొనుగోలు చేసేందుకు వీలుకల్పించే అమెండ్మెంట్.. హౌస్లో పాసవడంపై గర్వంగా ఉంది” అని ఖన్నా తెలిపారు.
ఏంటీ కాట్సా?
2014లో క్రిమియాపై రష్యా దాడిచేసి ఆక్రమించింది. అలాగే 2016 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లోనూ వేలు పెట్టిందని రష్యాపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రష్యా నుంచి మిలిటరీ హార్డ్వేర్, డిఫెన్స్ సిస్టమ్లను కొనే దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా 2017లో కాట్సా యాక్టు అమల్లోకి తెచ్చింది. రష్యాతో డిఫెన్స్, ఇంటెలిజెన్స్ సెక్టార్లలో ఒప్పందాలు చేసుకునే ఏ దేశంపైనైనా ఆంక్షలు విధించేందుకు ఇది వీలు కల్పించింది. ఎస్400 డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్లను కొనుగోలు చేసేందుకు 2018లో రష్యాతో మనదేశం రూ.40 వేల కోట్లతో డీల్ చేసుకుంది. ఈ డీల్పై నాటి ట్రంప్ సర్కారు అభ్యంతరం చెప్పినా లెక్కచేయలే. దాంతో అమెరికా కాట్సా కింద ఆంక్షలు విధించింది. తాజాగా ఆంక్షల నుంచి ఇండియాను తొలగించింది.
