
కాలిఫోర్నియా: అమెరికా న్యూక్లియర్ మిసైల్ను పరీక్షించింది. దేశ రక్షణ కోసం ‘గోల్డెన్ డోమ్’ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూఎస్ ఎయిర్ఫోర్స్ ఈ టెస్టును చేపట్టింది.
బుధవారం (May 21) కాలిఫోర్నియాలోని వాన్డెన్బెర్గ్ స్పేస్ బేస్ నుంచి న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్ కాంటినెంటర్ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం) మినిట్మ్యాన్ 3ని పరీక్షించింది. ఇది గంటకు 15,000 మైళ్ల వేగంతో 4,200 కిలోమీటర్లు ప్రయాణించి.. చివరికి మార్షల్ ఐల్యాండ్స్లోని బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రదేశానికి చేరింది. ఈ మిసైల్ టెస్టుపై యూఎస్ ఎయిర్ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది.
‘‘అమెరికా సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ ఐసీబీఎం టెస్టు చేపట్టాం. ఇది రొటీన్లో భాగంగానే నిర్వహించాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు, ఈ టెస్టుకు ఎలాంటి సంబంధం లేదు” అని అందులో పేర్కొంది. కాగా, ఈ మిసైల్లో న్యూక్లియర్ పేలోడ్ను అమర్చవచ్చు. దీన్ని గతంలోనూ పలుసార్లు పరీక్షించారు. పోయినేడాది నవంబర్లో ట్రంప్ విజయానికి ముందు కూడా ఒకసారి టెస్టు చేశారు.