సర్కారును ఇరకాటంలో పడేసేందుకేనా.. ?

సర్కారును ఇరకాటంలో పడేసేందుకేనా.. ?

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర హోంశాఖ, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సికింద్రాబాద్​లోని పరేడ్​గ్రౌండ్​లో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా, కర్నాటక, మహారాష్ట్ర సీఎంలు బసవరాజ్ బొమ్మై, ఏక్ నాథ్ షిండే హాజరుకానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సీఎం కేసీఆర్​ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. కేంద్ర పరిధిలోని సాయుధ బలగాలతో పరేడ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 17న తెలంగాణ విమోచన వేడుకలు రాష్ట్ర సర్కారు అధికారికంగా నిర్వహించాలని మొదట్నుంచీ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తున్నా..టీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో ప్రతిసారీ బీజేపీనే నిర్వహిస్తోంది. ఇపుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించాలన్న నిర్ణయం కేసీఆర్ సర్కారును ఇరకాటంలో పడేసేందుకేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సభకు ప్లాన్

ఓ పక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు, మరోవైపు అమిత్​షా రానుండటంతో హైదరాబాద్​లో భారీ సభకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సభకు అమిత్ ​షాను ఆహ్వానించాలని యోచిస్తున్నారు.

రాష్ట్రంలో పార్టీ పనితీరుపై తరుణ్ చుగ్ సమీక్షలు

బీజేపీ రాష్ట్ర ఇన్​చార్జి తరుణ్​చుగ్​ శనివారం హైదరాబాద్​కు రానున్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా బీజేపీ బలోపేతానికి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలపై ఈ నెల 6 దాకా రివ్యూ చేయనున్నారు. పార్టీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో కలిసి చుగ్ సమీక్షలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. రోజుకు రెండుమూడు జిల్లాలపై రివ్యూ చేస్తారన్నారు. పార్లమెంటరీ ప్రవాసీ యోజనలో భాగంగా మహబూబ్ నగర్ సెగ్మెంట్​లో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే శని, ఆదివారం పర్యటించనున్నారు. ఈ రెండ్రోజుల్లో మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి బీఎల్ వర్మ పర్యటిస్తారు.