న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య భావనకే మావోయిస్టులు వ్యతిరేకమని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల్ని ఏరిపార్తేమని హెచ్చరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా సోమవారం సమీక్షించారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా షా ఈ భేటీ ఏర్పాటు చేశారు. దేశంలోని పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. నక్సలిజం సమస్యను ఎలా ఎదుర్కొంటున్నారు, ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారని హోంశాఖ అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు నితీశ్కుమార్(బీహార్), నవీన్పట్నాయక్(ఒడిషా), యోగి ఆదిత్యనాథ్(యూపీ), కమల్నాథ్(మధ్యప్రదేశ్), రఘవర్దాస్(జార్ఖండ్), భూపేష్బఘేల్(చత్తీస్గఢ్), వైఎస్జగన్మోహన్రెడ్డి(ఏపీ), మహమూద్అలీ(తెలంగాణ డిప్యూటీ సీఎం)లతో పాటు వెస్ట్బెంగాల్, మహారాష్ట్ర లకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పారామిలిటరీ, హోంశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
8 వేలకు పైగా కేసులు
2009–13 మధ్య కాలంలోనే మావోయిస్టులపై 8782 హింసాత్మక ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయని హోంశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇదే కాలంలో సెక్యూరిటీ బలగాలతో సహా 3326 మందిని మావోయిస్టులు చంపేశారు. 2014–18 మధ్య కేసుల సంఖ్య 43 శాతం తగ్గిందని, నాలుగేళ్లలో 4969 కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ఈ పీరియడ్లో 1321 మంది మావోయిస్టుల దుశ్చర్యలకు బలయ్యారని చెప్పారు. మొత్తంగా 2009 నుంచి 2018 మధ్య పోలీసులు, భద్రతా బలగాల కాల్పుల్లో 1400 మంది మావోయిస్టులు చనిపోయారని అన్నారు. ఈ ఏడాది మొదటి 5 నెలల కాలంలో మావోయిస్టులు 310 హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని, దేశవ్యాప్తంగా 88 మందిని చంపేశారని వివరించారు.