
బీఆర్ఎస్ తో ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ కలవబోదన్నారు కేంద్రహోంమంత్రి అమిత్ షా.. మజ్లీస్ తో కలిసి ఉన్న వాళ్ల పక్కన కూడా తాము కూర్చోబోమన్నారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. కేసీఆర్ ఓవైసీతో కలిసి తెలంగాణ అమరవీరులను అవమానపరిచారన్నారు. కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలైందని.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేవి 4జీ, 3జీ, 2జీ పార్టీలు కాదని ప్రజల పార్టీ బీజేపీ అని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను సాగనంపి బీజేపీకి మద్దతివ్వాలని కోరారు అమిత్ షా. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలన్నారు. హైదరాబాద్ 75వ విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికివెళ్లడం ఖాయమని.. . బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తు సీఎం బీజేపీ అభ్యర్థే అవుతారన్నారు.
భద్రాద్రి రాముడికి ముత్యాల తలంబ్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. భద్రాచలం భక్తుల భావాలను కేసీఆర్ దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బీజేపీ గెలిస్తే రాముడి పాదాల దగ్గర కమలాన్ని పెడ్తమాని తెలిపారు. బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి కేసీఆర్ అవినీతిని కొనసాగించాలని చూస్తున్నారని.. అక్రమ కేసులు బనాయించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
యూపీఏ హయాంలో రైతులకు 22 వేల కోట్ల బడ్జెట్ ఉంటే..మోడీ దానిని లక్షా 25 వేల కోట్లకు తీసుకెళ్లారని అమిత్ షా వెల్లడించారు. రైతు పంట కొంటానని కేసీఆర్ మోసం చేశారని.. తెలంగాణ రైతులు పండించిన పంటను కేంద్రమే కొంటుందని చెప్పారు. మోడీ సర్కార్ పంటలకు గిట్టుబాటు ధర పెంచిందన్నారు. బీఆర్ఎస్ ను ఢీ కొట్టే దమ్మున్న పార్టీ బీజేపీనేన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకుు కేంద్రం 2.80 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు.