సీఏఏను తప్పుదోవ పట్టిస్తున్నరు..రాహుల్, ప్రియాంకలపై అమిత్ షా ఆరోపణ

సీఏఏను తప్పుదోవ పట్టిస్తున్నరు..రాహుల్, ప్రియాంకలపై అమిత్ షా ఆరోపణ

న్యూఢిల్లీ: సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ) విషయంలో కాంగ్రెస్​ లీడర్లు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర హోంమంత్రి, బీజేపీ ప్రెసిడెంట్​ అమిత్​ షా ఆరోపించారు. వారు అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో షా మాట్లాడుతూ.. సిటిజన్​షిప్​ పోతుందని మైనారిటీలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చారు. మన పొరుగున ఉన్న మూడు దేశాలలో మతపరంగా అణిచివేతకు గురవుతున్న మైనారిటీలకు సిటిజన్​షిప్​ ఇచ్చి, వారిని ఆదుకోవడానికే చట్టానికి సవరణలు చేసినట్లు షా స్పష్టం చేశారు. అంతేకానీ దేశంలోని పౌరుల నుంచి సిటిజన్​షిప్​ రద్దు చేయడం దీని ఉద్దేశం కాదన్నారు. బీజేపీ ఏర్పాటు చేసిన టోల్​ఫ్రీ నెంబర్​కు మిస్డ్​కాల్​ ఇచ్చి సీఏఏకు మద్దతు తెలపాలని అమిత్​ షా కోరారు. నాన్​కానా సాహెబ్​ గురుద్వారాపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. సిక్కులను భయాందోళనలకు గురి చేస్తోందని పాక్​ ప్రభుత్వంపై మండిపడ్డారు. పొరుగు దేశంలోని మైనారిటీల పరిస్థితి చూసి కళ్లు తెరవాలని ప్రతిపక్షాలకు  హితవు పలికారు. సీఏఏను నిరసిస్తున్న వారు పాక్​లోని సిక్కులను ఎక్కడికి పొమ్మంటారో చెప్పండని ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​పైనా షా విమర్శలు గుప్పించారు. ప్రజల సొమ్మును యాడ్స్​పై కేజ్రీవాల్​ వృథా చేస్తున్నారని విమర్శించారు.