ఓటీటీలో రిలీజ్ కానున్న అమితాబ్ మూవీ

ఓటీటీలో రిలీజ్ కానున్న అమితాబ్ మూవీ

ముంబై: బాలీవుడ్ షెహెన్ షా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ కథానాయకుడుగా నటిస్తున్న గులాబో సితాబో మూవీ డిజిటల్ రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గురువారం ప్రకటించారు. ఆయుష్మాన్ ఖురానాతో పని చేయడం చాలా బాగుందని అమితాబ్ చెప్పారు. ఇది తనకు స్పెషల్ ఫిల్మ్ అని ఆయుష్మాన్ పేర్కొన్నారు.

డిజిటల్ రంగానిదే ఫ్యూచర్
పీకూ, వికీ డోనర్, మద్రాస్ కేఫ్, పింక్ లాంటి వైవిధ్యమైన ఫిల్మ్స్ తో మంచి పేరు సంపాదించిన షూజిత్ సర్కార్ దర్శకత్వంలో గులాబో సితాబో తెరకెక్కింది. ఈ సినిమాను జూన్ 12న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. భూస్వామి, అద్దెదారుని మధ్య ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ను అమితాబ్, ఆయుష్మాన్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. రైజింగ్ సన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ లో రిజీజ్ కావడానికి సిద్ధమైంది. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ డిజిటల్ రూట్ లో ప్రేక్షకులకు సినిమాను దగ్గర చేయాలని నిర్ణయించుకున్నారు. ‘మొత్తానికి సాధ్యమైంత త్వరగా ఈ సినిమాను మీ ముందుకు ఉంచుతున్నందుకు సంతోషంగా ఉన్నా. ఊహించని పరిస్థితుల మధ్య కూడా ముందుకెళ్లాల్సిందే. డిజిటల్ లో సినిమా రిలీజ్ చేయడం మాకు ఇదే మొదటిసారి. చాలా ఉత్సుకతతో ఉన్నా. భవిష్యత్ డిజిటల్ దే కాబోతోంది’ అని డైరెక్టర్ షూజిత్ సర్కార్ చెప్పారు.