తండ్రి చివరి చూపు నోచుకోని అమృత

తండ్రి చివరి చూపు నోచుకోని అమృత

నల్గొండ జిల్లాలో సంచలనంగా మారిన పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు నిన్న హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇవాళ ఆయన అంత్యక్రియలు మిర్యాలగూడలో నిర్వహిస్తున్నారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశాన వాటికకు పోలీసు వాహనంలో అమృతతో పాటు, ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. అయితే అక్కడ అమృతను స్థానికులు అడ్డుకున్నారు.  అమృత రావడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. ‘మారుతీ రావు అమర్ రహే’, ‘అమృత గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా మారుతీ రావు కుటుంబ సభ్యులు, స్థానికులు అంగీకరించకపోవడంతో తన తండ్రిని ఆఖరి చూపు చూడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. మారుతీ రావు సోదరుడు శ్రవణ్ తన అన్న అంత్యక్రియలు నిర్వహించారు.