బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి..   గుండెపోటుతో కార్యకర్త మృతి

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి..   గుండెపోటుతో కార్యకర్త మృతి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్త ఒకరు గుండెపోటుతో చనిపోయారు. బొమ్మలరామారం మండలం కంచల్ తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ధీరావత్ నానుసింగ్(45) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు బిడ్డలు కాగా ఒకరి పెండ్లి చేశాడు. ఇదిలా ఉండగా  శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడానికి అతడు చీకటిమామిడి వెళ్లాడు.

మీటింగ్ జరుగుతున్న క్రమంలో అతడు కుర్చీలో కూర్చుని ఉండగా గుండెపోటు వచ్చింది. మీటింగ్ హడావుడిలో ఎవరూ అతడిని గమనించలేదు. ఈ క్రమంలో అతడి అంగిజేబులో ఉన్న సెల్ ఫోన్ మోగుతున్నా స్పందించకుండా కుర్చీలోనే పడుకుని ఉన్నాడు. పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ కార్యకర్తలు దీన్ని గమనించి అతడిని కదిలించగా లేవలేదు. దీంతో హాస్పిటల్ కు తరలిస్తుండగా చనిపోయాడు. అంత్యక్రియల కోసం ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రూ.50 వేలు అందజేశారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.