భోపాల్: కండ్లనిండా నీళ్లు.. బుగ్గలపైన చారలు.. ఒడిలో ఉన్న తమ్ముడి డెడ్బాడీపై వాలుతున్న ఈగలను తోలుతూ, నాన్న ఎప్పుడొస్తడా అని రోడ్డు వైపు దీనంగా చూస్తున్నడా కుర్రాడు. మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లా కేంద్రంలో శనివారం నాడు కనిపించిందీ సీన్. నెహ్రూ పార్క్ ముందు కూర్చున్న ఆ ఎనిమిదేండ్ల కుర్రాడి పేరు గుల్షన్. ఒడిలో ఉన్నది తమ్ముడి డెడ్బాడీ. అంబాహ్ తాలూకా బద్ఫారా గ్రామానికి చెందిన పూజారామ్కు నలుగురు పిల్లలు. నాలుగో వాడికి రెండేండ్లు. వాడి ఆరోగ్యం బాలేకపోవడంతో గుల్షన్ను వెంటబెట్టుకుని అంబులెన్స్లో జిల్లా కేంద్రం మోరేనాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిండు. అనీమియాతో బాధపడుతున్న బాబు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిండు.
వాళ్లను తీసుకొచ్చిన అంబులెన్స్ తిరిగెళ్లిపోయింది. ఆస్పత్రి డాక్టర్లను అడిగితే ఇంకో అంబులెన్స్ లేదని చెప్పారు. ఆస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ అంబులెన్స్డ్రైవర్ 30 కిలోమీటర్ల దూరానికి రూ.1500 డిమాండ్ చేసిండు. అంతడబ్బులేక పోవడంతో పూజారామ్ కొడుకు శవాన్ని తీసుకుని బయల్దేరిండు. నెహ్రూ పార్క్ దగ్గర గుల్షన్ను తమ్ముడి శవంతో పాటు కూచోబెట్టి ఏదైనా వాహనం దొరకకపోతదా అని వెతకడానికి పోయిండు. చిన్న కుర్రాడు, బట్టతో కప్పిన బాబు శవాన్ని చూసి స్థానికులు అక్కడ గుమిగూడారు. సమాచారం అందుకున్న యోగేంద్ర సింగ్ అనే పోలీసు అధికారి అక్కడికి చేరుకుని, ఆ తండ్రీ కొడుకులను తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి అంబులెన్స్లో వాళ్లను
బద్ఫారా గ్రామానికి పంపించారు.