మహబూబాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణ అభివృద్ధికి రూ. 50కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తొర్రూరు, మరిపెడ, డోర్నకల్కు రూ.25 కోట్లు చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేయడంతో పాటు ఆ నిధుల్లోని ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాన్ని అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు.
కేంద్రం తీరుతో వెనకబడ్డం
కేంద్రం అసమర్థ విధానాలతో ఎంతో నష్టపోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం తీరుతో జీఎస్డీపీ వెనుకబడిందన్నారు. మహబూబాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. దేశ అభివృద్ధిపై యువకులు చర్చించాలన్నారు. యువకులు ముందుకు వస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 20 ఏండ్లు గడిచినా కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవం
అంతకుముందు మహబూబాబాద్లో సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ను, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.