
షాద్ నగర్, వెలుగు : దొంగతనం నెపంతో ఒక దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కలకలం సృష్టించింది. విచారణ పేరుతో మహిళను రాత్రిపూట స్టేషన్ కు తీసుకెళ్లడమే కాకుండా బట్టలు సైతం విప్పించి పోలీసులు విచక్షణారహితంగా కొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత మహిళ కథనం ప్రకారం.. షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో సునీత, భీమయ్య దంపతులు నివాసం ఉంటున్నారు.
వారి కొడుకు జగదీశ్ (13) స్థానిక స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. వీరి ఇంటి ఎదురుగా ఆర్ఎంపీ నాగేందర్ ఉంటున్నాడు. ఆయన భార్య టీచర్ గా పని చేస్తోంది. అయితే, పోయిన నెల 24న నాగేందర్ క్లినిక్ కు, అతని భార్య స్కూల్ కు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చాక ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించారు. ఇంట్లో ఉన్న 26 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు కనిపించలేదని, బీరువాకు వేసిన తాళం వేసినట్టే ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ ఇంటి ఎదురుగా ఉన్న సునీత, భీమయ్యలపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సెక్షన్ 331(3), సెక్షన్ 305 (బీ) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రాత్రిపూట స్టేషన్ కు తీసుకెళ్లి..
సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, దొంగతనం చేసింది వాళ్లేనని ఆర్ఎంపీ నాగేందర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రాంరెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బందితో కలిసి సునీత, భీమయ్య, జగదీశ్ లను రాత్రి 9 గంటలకు స్టేషన్ కు తీసుకెళ్లారు. కొంతసేపటి తర్వాత భీమయ్యను వదిలేసిన పోలీసులు సునీత, జగదీశ్ ను దొంగతనం ఒప్పుకోవాలని విచక్షణారహితంగా కొట్టారు. కొడుకు కండ్ల ముందే సునీత బట్టలు విప్పించి, చెడ్డీ తొడిగి కర్రలతో కొడుతూ దారుణంగా హింసించారు.
జగదీశ్ ను సైతం అరికాళ్లపై బెల్ట్ తో కొట్టారు. దెబ్బలు తాళలేక సునీత స్పృహతప్పి పడిపోవటంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆస్పత్రిలో గుట్టుగా చికిత్స చేయించిన పోలీసులు ఆ తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని బాధిత మహిళ వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని పోలీసులు బెదిరించారని తెలిపింది. తమను అన్యాయంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
సైబరాబాద్ కమిషనరేట్కు డీఐ రాంరెడ్డి అటాచ్
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఉన్నతాధి కారులను ఆదేశించారు. డీఐ రాంరెడ్డిని సైబరాబాద్ కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్టు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం విచారించి నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం: ఎస్సీ కమిషన్ చైర్మన్
బాధిత దళిత మహిళ సునీతను ఆదివారం షాద్ నగర్ లోని ఆమె ఇంటికి వెళ్లి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ పరామర్శించారు. పోలీసులు తమను చిత్రహింసలకు గురి చేశారని, తమకు న్యాయం చేయాలంటూ సునీత తమ గోడును చెప్పుకుని విలపించింది. ఈ సందర్భంగా వెంకటయ్య, ప్రీతమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దాడులను సహించబోదని స్పష్టం చేశారు.
మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా మహిళను స్టేషన్ కు రాత్రిపూట తీసుకెళ్లి కొట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతను కొట్టిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని బాధిత కుటుంబానికి వారు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని, ఇది ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గతంలో మాదిరిగానే వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.
మేం కొట్టలేదు: డీఐ రాంరెడ్డి
సునీతను తాము కొట్టలేదని డీఐ రాంరెడ్డి తెలిపారు. నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, అనుమానితురాలైన సునీతను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించామని చెప్పారు. విచారణ తర్వాత తిరిగి ఇంటికి పంపించామని, అంతేతప్ప ఆమెపై పోలీసులు ఎవరూ చెయ్యి చేసుకోలేదన్నారు.