
అమ్ముడుపోని టిక్కెట్కు రూ. 12 కోట్ల లాటరీ తగలడంతో.. టికెట్లు అమ్మే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఈ ఊహించని ఘటన కేరళలో జరిగింది. తమిళనాడుకు చెందిన 46 ఏళ్ల షరాఫుదీన్ కేరళలోని కొల్లం జిల్లాలోని ఆర్యంకవు సమీపంలోని ఎరవిధర్మపురం వద్ద ప్రభుత్వ బంజరుభూమిలో తన ఆరుగురు కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. షరఫుదీన్ గతంలో గల్ఫ్లో పనిచేసేవాడు. షరఫుదీన్ 2013లో గల్ఫ్ నుంచి స్వస్థలానికి తిరిగివచ్చాడు. అప్పటినుంచి తన కుటుంబాన్ని పోషించడం కోసం లాటరీ టికెట్లు అమ్మడం ప్రారంభించాడు.
క్రిస్మస్-న్యూ ఇయర్ సందర్భంగా కేరళ ప్రభుత్వం ప్రకటించిన బంపర్ డ్రాలో షరఫుదీన్ దగ్గర ఉన్న అమ్ముడుపోని టికెట్ రూ. 12 కోట్ల మొదటి బహుమతిని గెలుచుకుంది. దాంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. షరఫుదీన్తో పాటు అతని తల్లి, భార్య, కుమారుడు, ఇద్దరు సోదరులు తమ కష్టాలన్నీ తీరుతాయని ఆనందం వ్యక్తం చేశారు.
‘నేను లాటరీలో గెలుచుకున్న డబ్బుతో సొంత ఇంటిని నిర్మించుకుంటాను. నా అప్పులన్నీ తీర్చేసి.. ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తాను. కొన్ని టికెట్లు అమ్ముడుపోగా.. మిగిలినవి నా దగ్గరే ఉంచుకున్నాను. వాటిలో ఒక టికెట్ డ్రా గెలుచుకుంది. నేను ఇలా డ్రా గెలుపొందడం ఇదే మొదటిసారి’ అని షరఫుదీన్ తెలిపాడు.
షరఫుదీన్ మంగళవారం తిరువనంతపురంలోని లాటరీ డైరెక్టరేట్ ముందు హాజరయ్యాడు. ఆయన గెలుచుకున్న రూ. 12 కోట్ల బహుమతిలో 30% పన్ను మినహాయింపు కింద పోగా.. సుమారు రూ .7.50 కోట్లు మరియు ప్రైజ్ మనీలో 10% ఏజెంట్ కమీషన్ లభిస్తుందని వర్గాలు తెలిపాయి.
గత ఏడాది సెప్టెంబర్లో ఇడుక్కికి చెందిన 24 ఏళ్ల అనంతు విజయన్ తిరువొనం బంపర్ డ్రా 2020 ద్వారా రూ .12 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణ కుటుంబానికి చెందిన అనంతు ఎర్నాకుళంలోని పొన్నెత్ ఆలయంలో గుమస్తాగా పనిచేసేవాడు.
For More News..