
- ఎన్సీబీతో కలిసి పట్టుకున్న అధికారులు
- వారణాసికి తరలిస్తున్నట్లు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: అంతర్రాష్ట్ర గాంజా సప్లయర్లపై తెలంగాణ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) ప్రత్యేక నిఘా పెట్టింది. ఏపీ, ఒడిశా బార్డర్ (ఏవోబీ) నుంచి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి కట్టడి చేస్తున్నది. ఇందులో భాగంగా ఒడిశా నుంచి వారణాసికి తరలిస్తున్న 500 కిలోల గంజాయిని మంగళవారం సీజ్ చేసింది.
ఖమ్మం నార్కోటిక్స్ టీమ్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో రాంచీ బ్రాంచి అధికారులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ వివరాలను ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా బుధవారం వెల్లడించారు. ఏవోబీ నుంచి హెచ్ఆర్బీ 4939 నంబర్గల ట్రక్లో భారీ మొత్తంలో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు ఈగల్ ఇంటెలిజెన్స్ కు సమాచారం వచ్చింది.
తెలంగాణలో పోలీస్ నిఘా ఉంటుందని భావించి బిజు ఎక్స్ప్రెస్ హైవే మీదుగా దారిమళ్లించారు. గంజాయి తరలిస్తున్న ట్రక్ను ఖమ్మం ఈగల్ టీమ్ వెంబడించింది. జార్ఖండ్ రూట్లో వెళ్తున్నట్లు గుర్తించింది. రాంచీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సమాచారం ఇచ్చింది.
జాయింట్ ఆపరేషన్లో జార్ఖండ్ రూర్కెల వద్ద ట్రక్ను అడ్డుకున్నది. లారీలో తరలిస్తున్న 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, హర్యానాకు చెందిన నసీం కమ్రుద్దీన్ (30)ను అరెస్ట్ చేసినట్లు సందీప్ శాండిల్యా తెలిపారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని గంజాయి డీలర్లు ముస్తాక్ ఖాన్, ఆరిఫ్కు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు.