
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో జూన్ 12వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ అందిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
ఇందులో యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం వైఎస్ జగన్ సోమవారం విద్యా కానుకను లాంఛనంగా పంపిణీ చేస్తారని తెలిపారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించే వేడుక రాష్ట్రస్థాయిలో జూన్ 20న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, హెచ్ఎంలనూ సత్కరిస్తామని తెలిపారు.
మరోవైపు.. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే గోరుముద్ద పథకం అమలు చేస్తామని మధ్యాహ్న భోజన పథకం సంచాలకులు డాక్టర్ నిధి మీనా తెలిపారు.