శ్రీకాళహస్తిలో జరిగిన బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు.. కానీ, ఇప్పటికీ అక్కడ ఏమీ జరగలేదని ఫైర్ అయ్యారు జేపీ నడ్డా.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందని.. ఇలాంటి రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదని జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయని... ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.. ఏపీ సర్కార్ అత్యంత అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన.. మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కామ్లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపించారు. ఏ స్కామ్ లు ఉన్నాయో.. అన్నింటినీ చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు..
బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు
జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్రవాటా ఇవ్వడంలేదని నడ్డా ఆరోపించారు. రాష్ట్రవాటా ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధిపనులు నిలిచిపోయాయని తెలిపారు. బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదంటూ... ఓటు బ్యాంకు రాజకీయాలను మోదీ బాధ్యతాయుత రాజకీయాల వైపు మళ్లించారని పేర్కొన్నారు.. దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ విధానం అని స్పష్టం చేశారు నడ్డా. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తొమ్మిదేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించిందన్నారు.. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోంది. పేదల పక్షపాతిగా మోడీ పాలన అందిస్తున్నారంటూ.. అభివృద్ధి అజెండాగానే బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సాగిందన్నారు. ఏపీకి ప్రధాని మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారని నడ్డా వెల్లడించారు.
ఒక్క అవకాశం ఇవ్వండి...
బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు..9 ఏళ్లుగా ఈ దేశానికి మోడీ సుపరిపాలన అందించారన్న ఆయన.. బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పాటుపడిన పేదల ప్రభుత్వం ఇది.. కరోనా సమయంలో దేశంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశామని గుర్తుచేశారు. మోడీ వచ్చాక మన దేశంలో పేదరికం రేటు తగ్గిందన్న నడ్డా.. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే మోడీ వచ్చాక ఈ 9 ఏళ్లలోనే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. ప్రపంచంలోనే మన దేశం వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు జేపీ నడ్డా..
మోడీ ఏం చేశారంటే...
మోదీ ప్రధాని అయ్యే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని, ఇప్పుడు దేశంలో విద్యుత్ లేని గ్రామమే కనిపించదని శ్రీకాళహస్తి సభలో జేపీ నడ్డా తెలిపారు. ఇవాళ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందుతోందని వివరించారు. దేశంలోని 50 కోట్ల మందికి మోడీ సర్కారు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోందని నడ్డా చెప్పారు. ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80 వేల కోట్లు ఖర్చుచేసిందని అన్నారు. ఉజ్వల పథకం కింద 9 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్టు వివరించారు.
