
ఏపీలో చిట్ ఫండ్ నిర్వహణకు నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఇకపై చిట్స్ లో లావాదేవీలన్నీ ఆన్ లైన్ లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. నూతన విధానంలో ఆన్ లైన్ లోనే లావాదేవీలు సాగనున్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ను మంత్రి ప్రారంభించారు.
ఆన్ లైన్ లావాదేవీలు
చిట్ ఫండ్ కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్ లైన్ విధానంలో మాత్రమే లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు ఏపీ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు ఇ-చిట్స్ అనే యాప్ రూపొందించింది.
ఇ- చిట్స్ లో చెక్ చేసుకోవచ్చు
చందాదారులు ఇ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. కొన్ని సంస్థలు చందాదారులను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటికి అడ్డుకట్టవేసేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి ధర్మాన తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్లోనే చిట్స్ను పరిశీలించి ఆమోదం తెలియజేస్తారన్నారు. ఇకపై ఈ విధానం ద్వారా మాత్రమే చిట్ లు నిర్వహించాల్సి చిట్ ఫండ్ సంస్థలను ఆదేశించారు. చిట్ సంస్థలన్నీ ఈ విధానాన్ని అమలు చేయాల్సిందేనని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు.
చందాదారులు మోసపోకూడదనే
చందాదారులు మోసపోకుండా ఉండాలనే ఈ విధానం తెచ్చామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఏపీలో గత కొంత కాలంగా కొన్ని ప్రైవేట్ చిట్ సంస్థల్లో సీఐడీ సోదాలు చేస్తుంది. ఈ కేసులో కొందరిని సీఐడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. చిట్ ఫండ్ విధానంలో తప్పులు జరుగున్నాయని, చందాదారుల డబ్బును ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీ ప్రభుత్వం చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.