వినోద్ కుమార్ క్యాంప్ ఆఫీసు ముట్టడి : అంగన్‌వాడీలు

వినోద్ కుమార్ క్యాంప్ ఆఫీసు ముట్టడి : అంగన్‌వాడీలు

కరీంనగర్ టౌన్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీలు ఆదివారం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. కొద్దిసేపు రోడ్డుపై ధర్నా చేసిన అనంతరం ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్‌వాడీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈటైంలో లేడీ పోలీసులు లేకపోగా మగ పోలీసులే తమను నెట్టేశారంటూ అంగన్‌వాడీలు ఆరోపించారు. అనంతరం ఏసీపీ నరేశ్​ వినతిపత్రం తీసుకుని వారిని అక్కడి నుంచి పంపించారు. 

కండ్లకు గంతలు కట్టుకొని నిరసన

జగిత్యాల రూరల్ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ ​ముందు అంగన్‌వాడీలు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. వీరికి బీజేపీ కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలు 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోడం బాధాకరమన్నారు. అనంతరం సీఐటీయూ జిల్లా కన్వీనర్​రాజలింగం సంఘీభావం తెలిపారు.