అనిల్‌‌ అంబానీ మెడ చుట్టూ బిగుసుకుంటున్న అప్పుల ఉచ్చు

అనిల్‌‌ అంబానీ మెడ చుట్టూ బిగుసుకుంటున్న అప్పుల ఉచ్చు

అనిల్‌‌ దారులన్నీ క్లోజ్‌‌!

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: మాజీ బిలినియర్‌‌‌‌ అనిల్‌‌ అంబానీ మెడ చుట్టూ అప్పుల ఉచ్చు మరింతగా బిగుసుకుపోతోంది. పర్సనల్‌‌ గ్యారెంటీ ఇచ్చి కంపెనీల కోసం లోన్లు తీసుకున్న కేసులలో  బ్యాంకులు ఆయన్ని కోర్టుకు లాగుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్‌‌ కోర్టులో చేదు అనుభవం ఎదుర్కొన్న అంబానీకి ఇండియన్‌‌ కోర్టులలో కూడా ఎదురుదెబ్బ తప్పేట్టు లేదు. ముందు వరకు కంపెనీల లోన్ల కోసం ఇచ్చే పర్సనల్‌‌ గ్యారెంటీలను ఇన్‌‌వోక్‌‌(అప్పుకు బాధ్యత వహించడం) చేసే అవకాశం బ్యాంకులకు ఉండేది కాదు. కంపెనీ డిఫాల్ట్‌‌ అయితే కేవలం కార్పొరేట్‌‌ గ్యారెంటీలను మాత్రమే ఇన్‌‌వోక్‌‌ చేయడానికి వీలుండేది. కానీ ఈ లూప్‌‌ హోల్‌‌ను కవర్‌‌‌‌ చేయడానికి ప్రభుత్వం కొత్త రూల్‌‌ను తీసుకొచ్చింది. కంపెనీలు డిఫాల్ట్‌‌ అయితే లోన్లు తీసుకోవడంలో ప్రమోటర్లు లేదా ఇతరులు ఇచ్చిన పర్సనల్‌‌ గ్యారెంటీలను లెండర్లు  ఇన్‌‌వోక్‌‌  చేసుకోవచ్చు. ఈ రూల్‌‌తో ఇప్పటికే పర్సనల్‌‌ గ్యారెంటీ కింద బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న అంబానీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, ఇన్‌‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ బోర్డ్‌‌(ఐబీబీఐ) నిర్ణయించుకున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కంపెనీలు డీఫాల్ట్‌‌ అయితే కార్పొరేట్‌‌ గ్యారెంటీలను ఇన్‌‌వోక్‌‌ చేస్తున్నప్పుడు,  ఈ కేసులలో పర్సనల్‌‌ గ్యారెంటీలను కూడా ఇన్‌‌వోక్‌‌ చేయడంలో తప్పులేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పర్సనల్‌‌ గ్యారెంటీలను ఇన్‌‌వోక్ చేయలేకపోతే అప్పులివ్వడంలో లెండర్లు వెనకడుగేస్తారని చెబుతున్నారు. ఎకానమీ పెరుగుతున్న  టైమ్‌‌లో  చాలా కంపెనీల ప్రమోటర్లు పర్సనల్‌‌ గ్యారెంటీలిచ్చి  లోన్లు తీసుకున్నారని ఎనలిస్టులు అన్నారు. వీరు అప్పులు తెచ్చి తమ కంపెనీలను విస్తరించాలని చూశారని పేర్కొన్నారు. కానీ ఎకానమీ వృద్ధి  తగ్గడం ప్రారంభించాక బ్యాంకుల వద్ద మొండిబాకీలు పేరుకుపోయాయని, ఆ టైమ్‌‌లో అప్పులు తీర్చడానికి ఇలాంటి ప్రమోటర్లు  ముందుకు రాలేదని చెప్పారు.

భూషణ్‌‌ స్టీల్‌‌ మాజీ బాస్ తర్వాత అనిల్‌‌ అంబానీనే!

ఈ కొత్త రూల్‌‌ వలన భూషణ్‌‌ పవర్ అండ్ స్టీల్స్‌‌ మాజీ బాస్‌‌ సంజయ్‌‌ సింఘల్‌‌  మొదట కోర్టు మెట్లెక్కనున్నారు. ఈయన పర్సనల్‌‌ గ్యారెంటీ మీద రూ. 12,000 కోట్లను ఎస్‌‌బీఐ నుంచి  భూషణ్‌‌ స్టీల్స్‌‌ అప్పుగా తీసుకొంది. ఈ అప్పును చెల్లించాలని  సంజయ్​కు ఎస్‌‌బీఐ డిమాండ్‌‌ నోటీసులను  పంపింది. ఆర్‌‌‌‌కామ్‌‌, రిలయన్స్ ఇన్‌‌ఫ్రాటెల్‌‌ కోసం ఎస్‌‌బీఐ నుంచి తీసుకున్న రూ. 1,200 కోట్ల లోన్‌‌ విషయంలో అనిల్ అంబానీ పర్సనల్‌‌ గ్యారెంటీగా ఉన్నారు. ఈ డబ్బులు కట్టాలని అంబానీకి ఎస్బీఐ నోటీసులు పంపింది. దీంతో ఈయన కూడా పర్సనల్‌‌ గ్యారెంటీ ఇష్యూపై కోర్టు మెట్లెక్కనున్నారు. రిలయన్స్‌‌ కమ్యూనికేషన్‌‌ 2012 లో అంబానీ పర్సనల్‌‌ గ్యారెంటీపై 925 మిలియన్‌‌ డాలర్ల లోన్‌‌ను తీసుకుందని  గతంలో ఇంగ్లండ్‌‌ కోర్టులో ఇండస్ట్రీయల్‌‌ అండ్‌‌ కమర్షియల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్ చైనా కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ లోన్‌‌కు సంబంధించి తనెప్పుడూ పర్సనల్‌‌ గ్యారెంటీ ఇవ్వలేదని అంబానీ వాదించారు . కానీ కోర్టు మాత్రం ఆయన మాటలను నమ్మలేదు. ఆయన చూపిస్తున్న ఆధారాలు నమ్మలేనివని యూకే కోర్టు పేర్కొంది.  గతంలో పర్సనల్‌‌ గ్యారెంటీ ఇష్యూపై అనిల్‌‌ అంబానీ జైలుకు కూడా వెళ్లుండేవాడు. స్వీడిష్‌‌ టెలికాం ఎక్విప్‌‌మెంట్‌‌ కంపెనీ ఎరిక్స్‌‌న్‌‌కు చెల్లించాల్సిన 80 మిలియన్‌‌ డాలర్లను అన్న ‌‌ ముకేష్‌‌ అంబానీ చెల్లించడంతో జైలుకు వెళ్లకుండా బయటపడగలిగాడు.